ఆరేళ్ళ చిన్నవాడ్ని చేసుకుంటే... గర్భవతిని చేసి, తల్లిదండ్రులతో పోయాడు
ఆమె తనకన్నా ఆరేళ్ళ చిన్న వాడిని పెళ్ళిచేసుకుంది. గర్భవతి అయ్యాక, అతడి తల్లిదండ్రులు రంగ ప్రవేశం చేయగా అతడు ఆమెను వదిలేసి వారితో వెళ్ళిపోయాడు.
గుంతకల్: ఆమెకు 27 ఏళ్ళు. అయినా తనకన్నా ఆరేళ్ళ చిన్న వాడిని పెళ్ళిచేసుకుంది. అంతకుముందే ఆమె విడాకులు తీసుకున్నా.. ఆ యువకుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.
కొంతకాలం బాగానే కాపురం చేశారు. ఆమె గర్భవతి కూడా అయింది. ఈ లోగా అతడి తల్లిదండ్రులు రంగ ప్రవేశం చేసేసరికి ఆ యువకుడు కూడా ప్లేటు ఫిరాయించాడు. ఆమెను వదిలేసి వారితో వెళ్ళిపోయాడు.
కట్టుకున్న భర్తను అతడి తల్లిదండ్రులు వచ్చి వెంటబెట్టుకొని పోవడంతో, గర్భవతి అయిన ఆమె ఆత్మహత్య యత్నానికి ఒడి గట్టింది. గుంతకల్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గుంతకల్ కు చెందిన రాజేశ్వరి(27) అప్పటికే పెళ్ళయి భర్త నుంచి విడాకులు తీసుకుంది. వయసులో తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన కర్నూలుకు చెందిన సాయి ఈశ్వర్ ను ఫేస్ బుక్ లో చూసి ఇష్టపడింది.
ప్రేమకు వయసు అడ్డు కాదని భావించిన ఈశ్వర్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి హైదరాబాద్ లో కాపురం పెట్టారు. రాజేశ్వరి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం ఆమె గర్భవతి.
అయితే తమ కుమారుడికి పెళ్ళయిందని, హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసుకున్న ఈశ్వర్ తల్లిదండ్రులు రాజేశ్వరి కాపురంలో చిచ్చు పెట్టారు. తమ కుమారుడు ఇంకా మైనరేనని, 21 సంవత్సరాలు కూడా దాటలేదని చెబుతూ అతడ్ని తమతో తీసుకెళ్ళిపోయారు.
భార్త కోసం కర్నూలు వెళ్ళిన రాజేశ్వరికి తీవ్రనిరాశ ఎదురైంది. తాను తన తల్లిదండ్రులతోనే ఉంటానని అతడు తెగేసి చెప్పడంతో రాజేశ్వరి తీవ్ర మనస్తాపం చెంది బ్లేడుతో చెయ్యి కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రాణాపాయం నుంచి బయట పడింది. తన భర్తను తనతో పంపాలని ఆమె కోరుతుండగా, ఈశ్వర్ మాత్రం తల్లిదండ్రుల మాటే వింటానని అంటున్నాడు.