ఉత్తర తెలంగాణ పాలనొద్దు: కెసిఆర్పై డికె, టిలో విభజన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మాజీ మంత్రి, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెసు సీనియర్ శాసన సభ్యురాలు డికె అరుణ గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్ బయటి నుండి జిల్లాలో పెత్తనం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు.
జిల్లాను విభజిస్తామంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రాంతాన్ని తాము అభివృద్ధి చేసుకుంటామని డికె అరుణ చెప్పారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడగా ఉన్న కెసిఆర్ జిల్లాకు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు.

కేవలం మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేయని కెసిఆర్.. ఇక తెలంగాణ మొత్తాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవవి కోసం కెసిఆర్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఉత్తర తెలంగాణ వాళ్లు వచ్చి దక్షిణ తెలంగాణను పాలిస్తే ఊరుకోమన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాను మూడు ముక్కలు చేస్తామన్న కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర విభజన నేపథ్యంలో.. తెలంగాణలోనూ భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలు రావచ్చనడానికి అరుణ మాటలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రానికి కమల్ నాథన్ కమిటీ
విభజన పూర్తి అయిన నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు ప్రభుత్వ ఉద్యోగులను పంపిణీ చేసేందుకు ఏర్పాటైన కమల్నాథన్ కమిటీ గురువారం నగరానికి చేరుకుంది. కేంద్ర సహాయకార్యదర్శి అర్చనా వర్మ, ఎస్సార్సీ డైరెక్టర్ కిప్ జాన్, ఎస్ నాయక్, ప్రతాప్ ఈ కమిటీ సభ్యులుగా నగరానికి చేరుకున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, వివిధ శాఖల అధికారులతో కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన నేపథ్యంలో కేవలం ఉద్యోగుల విభజనపై ఈ కమిటీ విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications