సిఎంపై అరుణ ఫైర్: అటెండర్ సోయి లేదని కోమటిరెడ్డి
హైదరాబాద్/ నల్లగొండ/ న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి డికె అరుణ తప్పు పట్టారు. నచ్చకపోతే విడిపోవచ్చునని విలీనం సయమంలో నెహ్రూ చేప్పిన మాటలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరిచిపోయారా అని ఆమె అడిగారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సమంజసంగా లేవని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాలాగుణంగా రాజ్యాంగాన్ని, చట్టాలను మార్చుకుంటున్నామని, తెలంగాణపై నిర్ణయం కూడా అలాంటిదేనని ఆమె అన్నారు.
ఇరు ప్రాంతాల ప్రజలకు ఇష్టం లేని రోజు విడిపోవచ్చునని గతంలో భారత తొలి ప్రధాని నెహ్రూ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యుసి తీసుకున్ని నిర్ణయానికి ముఖ్యమంత్రి సహా అందరూ కట్టుబడి ఉండాలని ఆమె అన్నారు. నెహ్రూ కుటుంబానికి చెందిన సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడంలో తప్పు లేదని ఆమె అన్నారు. అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాత కాంగ్రెసు అధిష్టానం విభజన నిర్ణయాన్ని తీసుకుందని ఆమె చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిపై మాజీ మంత్రి, నల్గొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెధవ అని, అటెండర్కున్న జ్ఞానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. క్యాంప్ ఆఫీసు సమైక్య ఉద్యమ ఆఫీసుగా మార్చారని ఆయన శనివారం మీడియాతో అన్నారు. సమైక్యాంధ్ర ముసుగులో వందకోట్లు వెనుకేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ మంత్రులకు చీము, నెత్తురుంటే రాజీనామా చేయాలని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సీఎం దిష్టి బొమ్మలు తగులబెట్టాలని పిలుపునిచ్చారు. సీఎంను బర్తరఫ్ చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఓ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరాలని సూచించారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీయే ఇంటికి పంపుతుందని హెచ్చరించారు. సీఎం కిరణ్ వైఖరిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ను కలిసి వివరిస్తానని పాల్వాయి వెల్లడించారు.