రాత్రి లేడీ టెక్కీకి వేధింపు, కేబీఆర్ ఫైరింగ్పై డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు డీకే అరుణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శాంతిభద్రతల అంశాన్ని సభలో ప్రస్తావించారు. రెండు రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ యువతిని అర్ధరాత్రి వేధించారని, నిన్న (బుధవారం) ఉదయం కేబీఆర్ పార్కులో ఏకే 47తో కాల్పులు జరిపారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నాయిని మాట్లాడుతూ హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామన్నారు. నగరంలో క్లబ్లను మొత్తం మూసివేయించిన చరిత్ర తమ ప్రభుత్వానిదే అని వెల్లడించారు.
చైన్స్నాచింగ్లను అరికట్టడటానికి అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. నగరంలో వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రూ.70 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అంతకుముందు ఉదయం పది గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. కాకతీయుల స్ఫూర్తితోనే తెలంగాణలో చెరువుల అభివృద్దికి శ్రీకారం చుట్టామని హరీశ్ రావు ప్రశ్నోత్తరాల సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకే చెరువుల అభివృద్ధిని చేపడుతున్నట్లు చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి రంగంలో తెలంగాణ నిరాదరణకు గురైందని, నాటి నష్టాన్ని భర్తీ చేసేందుకే ఈ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. గతంలో పది జిల్లాలకు ఓ ఎస్ఈ ఉండగా, ప్రత్యేక రాష్ట్రంలో ప్రతి జిల్లాకూ ఓ ఎస్ఈని నియమించామన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చెరువుల పూడికతీత పనులు చేపడతామన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో చెరువుల పునరుద్ధరణ ఉంటుందన్నారు.
ఉద్యోగుల పదవీ విరణ వయసు పెంచేది లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రశ్నోత్తరాల సందర్భంగా అన్నారు. రాష్ట్రం వచ్చాక ఉద్యోగాల కోసం యువకులు ఎదురు చూస్తున్నారన్నారు. 58 ఏల్లకే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరణ ఉంటుందన్నారు. రాష్ట్రం తెచ్చుకున్నాక ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత ఆశగా ఎదురు చూస్తోందని, ఖాళీలు త్వరలో పూర్తి చేస్తామన్నారు.
వారం తర్వాత సభకు టీడీపీ సభ్యులు
గత వారం సభ నుండి సస్పెన్షన్కు గురైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వారం రోజుల తర్వాత సభకు వచ్చారు. కాగా, విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతి మధుసూదనాచారి తిరస్కరించారు.