బాగా లేదు: సిఎంలపై డిఎల్, రాజధానిపై ఉత్తరాంధ్రలోనూ.. బాబును ఇరుకున పెట్టారు
కడప: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాలన సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.
రాయలసీమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వాలని హితవు పలికారు. తద్వారా సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టారు. రాయలసీమ ఉద్యమానికి చంద్రబాబును మద్దతివ్వమని డిఎల్ కోరడం గమనార్హం.
డిఎల్ రవీంద్రా రెడ్డి ఇంకా మాట్లాడుతూ... అమరావతి పైన రాయలసీమలోనే కాకుండా ఉత్తరాంధ్రలోను తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. ఈ నెల 21వ తేదీన తిరుపతిలో రాయలసీమ జిల్లాల నేతలతో సమావేశం అవుతామని చెప్పారు.
చంద్రబాబు మోసం చేశారు: మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ వేరుగా మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏపీలో టీడీపీని గెలిపించింది, అంతకు ముందు తెలంగాణలో టీడీపీని నడిపించింది మాదిగలే అన్నారు.
ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అనుక్షణం తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉన్న మాదిగలను చంద్రబాబు మోసం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. మందకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.