శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం కావాలి: చంద్రబాబుకు కరుణానిధి లేఖ
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి లేఖ రాశారు.
ఏపీ ప్రజలు గొప్ప అభివృద్ధి బాటలో పయనించాలని, శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలంటూ పలు రాష్ట్రాల సీఎంలకు, ప్రతిపక్ష నేతలకు, వీవీఐపీలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానాలు పంపిన సంగతి తెలిసిందే.
దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖులకు స్వయంగా కలిసి ఆహ్వాన పత్రాలను అందజేయడం, ఫోన్ల ద్వారా తెలియజేయడం, ఈ-మెయిళ్లు పంపి వారిని ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ఆహ్వానాన్ని అందుకున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తన ప్రతిస్పందనగా లేఖ రాశారు.
ఈనెల 22వ తేదీన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రులు, సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. 'మై బ్రిక్ - మై అమరావతి'కి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. ఇక నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్టుల్లోకి ఎక్కించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలోని 16 వేల గ్రామాల నుంచి మట్టి, దేశంలోని అన్ని నదులు, అన్ని మతాల దేవాలయాలు, మహనీయుల ఇళ్ల నుంచి నీరు, మట్టి సేకరించి అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రార్థనలు, పూజలు, మంత్రాలతో శంకుస్థాపన ప్రాంగణం మారుమోగాలని సూచించారు.
ప్రపంచంలోనే ఇటువంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి. దీంతో అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్లోకి స్ధానం పొందే అవకాశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం రాష్ట్ర మంత్రులు, అధికారులతో సమీక్షించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరగాలని మంత్రులకు, అధికారులకు ఆదేశించారు.