పార్లమెంట్ లో రాజధాని అమరావతి కోసం ఆ పని చెయ్యండి .. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు . జగన్ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన టీడీపీ రాజధాని అమరావతి ని మార్చటం, 3 రాజధానుల ప్రకటన, మండలి రద్దు, పోలవరం పనుల నిలిపివేత,ఉపాధి హామీ పథకం నిధుల మళ్లింపు, టీడీపీ నేతలపై అక్రమ కేసులు తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది .
మండలి రద్దుపై టీడీపీ వర్సెస్ వైసీపీ ... ఎవరి వాదన కరెక్ట్ ?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో టీడీపీ వ్యూహం
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడిన చంద్రబాబు ఏపీ ప్రజల పక్షాన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా తమ వాదన వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అంతే కాదు ఏపీలో వైసీపీ హయాంలో జరుగుతున్న అవకతవకలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
9 అంశాలపై పార్లమెంట్ వేదికగా మాట్లాడనున్న టీడీపీ ఎంపీలు
పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన 9 అంశాలపై చర్చించిన టీడీపీ ఎంపీలు ప్రధానంగా రాజధాని అమరావతి తరలింపు, మూడు రాజధానుల ప్రకటన, ఉపాధి హామీ నిధుల దారిమళ్లింపు, నిలిచిన పోలవరం పనులు, కండిషనబుల్ బెయిల్ షరతులను ఉల్లంఘించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రలోభాలు, రాస్తున్న లేఖలు, మీడియాపై దాడులు, ఆంక్షలు, దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపులపై గళమెత్తాలని నిర్ణయం తీసుకున్నారు.
రాజధాని అమరావతి రైతుల పోరాటం తెలియజెయ్యాలని నిర్ణయం
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, విధ్వంస కార్యక్రమాలు, అవినీతి, అక్రమాలు, కేంద్ర నిధుల సద్వినియోగంలో వైఫల్యం, ఉన్న నిధులను ఖర్చు చేయకపోవడం, పెట్టుబడులన్నీ వెనక్కి తరలిపోవడం తదితర అంశాలన్నీ పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని నిర్ణయించారు. 42 రోజులుగా రాజధాని అమరావతిలో భూములిచ్చిన రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలను, అమరావతి తరలి పోతుందన్న ఆవేదనతో 30 మందికి పైగా మృతి చెందడాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని నిర్ణయించారు .
Recommended Video
కేంద్రం దృష్టికి అమరావతి తరలింపు, శాసనమండలి రద్దు అంశాలు
ఇక అంతే కాదు మహిళలపై లాఠీఛార్జ్ చెయ్యటం, వందలాదిమంది రైతులను, రైతు కూలీలను జైళ్లకు పంపడం తదితర అంశాలన్నీ పుస్తక రూపంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, జాతీయ పార్టీల పెద్దలకు, రాజ్యాంగ వ్యవస్థల పెద్దలకు అందజేయాలని నిర్ణయించారు . జాతీయ సంపద అయిన అమరావతిని ధ్వంసం చేస్తున్నారని, రూ. లక్ష కోట్ల సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలి రద్దు నిర్ణయం గురించి జాతీయ పార్టీల నాయకులకు, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని తమ వాయిస్ గట్టిగా వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు .