సుప్రీం కోర్టులో నైనా...ఆ విద్యార్థులకు న్యాయం జరగాలి : సిఎం చంద్రబాబు
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో జరిగే మెడికల్ కౌన్సెలింగ్లో బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్ధులకు న్యాయం చేయాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
మెడికల్ కౌన్సెలింగ్లో జివో 550 అమలును హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో రిజర్వేషన్ అభ్యర్ధులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో జివో 550 అమలుపై గట్టిగా వాదనలు వినిపించాలని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇదే విషయమై ఇప్పటికే వివిధ పార్టీల నేతలు, రిజర్వేషన్ కేటగిరి విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సిఎం సమీక్షనిర్వహించారు.
మెడికల్ కాలేజీల ఎంపికలో రిజర్వేషన్ అభ్యర్థులకు స్వేచ్ఛ చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేందుకు సిద్ధమైన క్రమంలో దీనిపై గ్రీవెన్స్ హాల్లో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీల్లో సీట్ల ఎంపికలో రిజర్వేషన్ అభ్యర్థుల నిర్ణయానికి వదిలేయాలన్న 2001 లో ఇచ్చిన జీ.వో. 550 అమలుకు ఎదురైన ఇబ్బందులపై సమీక్ష చేశారు.
2001 లో ఇచ్చిన జీ.వో. 550 ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులు మెరిట్ పై ఓపెన్ క్యాటగిరిలో మెడికల్ కాలేజీ సీటు లభిస్తే అతని ఇష్టానుసారం ఓపెన్ లేదా రిజర్వేషన్ కేటగిరిల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వీలుంది. ఆ అవకాశాన్ని నిలిపివేస్తూ ఆగస్టు 7 న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రిజర్వేషన్ అభ్యర్థికి మెరిట్ లో సీటువస్తే అతన్ని ఓపెన్ క్యాటగిరీ అభ్యర్థిగా మాత్రమే భావించాలని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ఈ అంశాలను సంబంధిత అధికారులతో సమగ్రంగా ముఖ్యమంత్రి చర్చించారు.
హైకోర్టు ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆ మేరకు జీవో 550 ప్రకారం గతంలో రిజర్వేషన్ అభ్యర్థులకున్న అనుకూల పరిస్థితులు కల్పించాలని సీఎం చెప్పారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం, ప్రభుత్వం తరఫునా రెండు పిటీషన్లను వేర్వేరుగా సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు. ఈ నెల 30 లోపు మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాల్సి వుండగా లేని పక్షంలో ఆ మేరకు సీట్లు మిగిలిపోయే పరిస్థితి వుంటుంది. దీంతో రిజర్వేషన్ కేటగిరీల విద్యార్థులు నష్టపోనున్నారు.
జీవో 550 అమలుకు ప్రతిబంధకంగా మారిన హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో సమగ్రంగా వాదించి రిజర్వుడు కేటగిరి విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ ప్రయత్నాలు సాగించాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు తెలంగాణాలోనూ ఇదే విషయమై రగడ జరుగగా మెడికల్ కౌన్సిలింగ్ లో రిజర్వేషన్లు అమలు చేసే విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
50 శాతానికి పైగానే రిజర్వేషన్లు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇచ్చిందని కృష్ణయ్య ఆరోపించారు. వాస్తవానికి 50 శాతానికి మించి రిజర్వేషన్లు లేవని బీసీలకు 25 శాతం, మైనార్టీలకు 4 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలపైన ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా ఈ తీర్పుపై వెంటనే సుప్రీం కోర్టులో అప్పీల్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.