సింగపూర్ వద్దు, అమరావతి ఇలా కడితే బెస్ట్: బాబుకు డెడ్లైన్
అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిని సింగపూర్ కంపెనీలు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మిస్తే సహజసిద్ధమైన వనరులు కనుమరుగై భావితరాల పొట్ట కొట్టిన వాళ్లమవుతామని ప్రొఫెసర్ విక్రం సోనీ హెచ్చరించారు.
సారవంతమైన కృష్ణా నదీపరివాహక జరీబు భూములను వ్యవసాయానికి వినియోగిస్తూనే ప్రభుత్వం సేకరించిన భూమిలో సహజసిద్ధ నగరాన్ని ఎలా నిర్మించవచ్చో ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్లు, నేచరల్ సిటీ విధానకర్తలు విక్రం సోనీ, రోమి ఖోస్లాలు అమరావతి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు.
ప్రకృతి సహజవనరులను కాపాడుకుంటూనే ఆహారభద్రత, పర్యావరణ హితంతో కూడిన రాజధాని మాస్టర్ ప్లాన్ను వారు రూపొందించారు. దీనిని మంగళవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వర రావు చేతుల మీదుగా విడుదల చేశారు.
అమరావతి, ఇలా వద్దు
విక్రం సోని వివరిస్తూ... కృష్ణా నదీ వరదల సమయంలో కొట్టుకు వచ్చే ఒండ్రుమట్టి, ఇసుక వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా ఏడాది పొడవునా 300 రకాల పంటలు పండుతున్నాయన్నారు. ఇలాంటి సారవంతమైన జరీబు భూముల్లో కోర్ కేపిటల్ నిర్మించతలపెట్టడాన్ని సమాజహితం కోరే ఏ ఒక్కరు సమ్మతించరని చెప్పారు.
ఇలా నిర్మించాలి
నది ఒడ్డు నుంచి మూడు కిలోమీటర్లు వదిలి రాజధాని నిర్మించుకుంటే నగరానికి కావాల్సిన నీరు, వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఎవరి పైనా ఆధారపడనక్కరలేదని వివరించారు. దీని వల్ల కేవలం భూగర్భ జలాల రూపంలో ఏటా రూ.900 కోట్ల విలువైన నీటిని ఆదా చేసుకోవచ్చునని తెలిపారు. ఇలా మూడు కిలోమీటర్లు వదిలి నగరాన్ని కట్టడం వల్ల అంతర్గత ఉష్ణోగ్రతలు పది డిగ్రీలు, బహిరంగంగా నాలుగు డిగ్రీలు తగ్గుతాయన్నారు.
వ్యవసాయ నగరాలు
కృత్రిమంగా నిర్మించే ఆకాశహర్మ్యాలకు ఇప్పుడు కాలం చెల్లిందని, ఉపాధి, వ్యవసాయంతో కూడిన నగరాల నిర్మాణాల వైపు ప్రపంచం నడుస్తోందని ఈ మాస్టర్ ప్లాన్ ఆర్కిటెక్లో పాలుపంచటుకున్న సచిన్ జైన్ తెలిపారు. యూరప్లో సహజ నగరాల నిర్మాణానికి డిమాండ్ పెరిగిందన్నారు.
చండీగఢ్ ఉదాహరణ
భారతీయులకు నగరాలు నిర్మించిన అనుభవం లేదని, మురికికూపాలు కడతారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకాన్ని తెలుపుతున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అయిదు వేల ఏళ్ల క్రితమే హరప్పా నగరాన్ని సృష్టించిన చరిత్ర మన భారతీయులది అన్నారు. ఈ మధ్యనే ప్రకృతిని కాపాడుతూ ఎకరం వ్యవసాయ భూమి తీసుకోకుండా చండీగఢ్ను అద్భుతంగా నిర్మించారన్నారు.
సారవంతభూములు సృష్టించలేం
వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీ రాజధాని కూడా వ్యవసాయ రంగాన్ని ప్రతిబింభించే విధంగా ఉండాలని చండీగఢ్ నగర నిర్మాణంలో పాలుపంచటుకున్న విశ్రాంత ఐఏఎస్ దేవసహాయం అన్నారు. భవనాలను మరెక్కడైనా నిర్మించుకోగలమని, సారవంతమైన భూములను మాత్రం మరోచోట సృష్టించలేమన్నారు.
వడ్డె శోభనాద్రీశ్వర రావు
వడ్డె శోభనాద్రీశ్వర రావు మాడట్లాడుతూ... రైతు త్యాగాన్ని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి, క్విడ్ ప్రోకో కింద సింగపూర్ కంపెనీలకు పప్పుబెల్లాల్లా కట్టబెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఇస్తున్నామని, అప్పటికీ దారికి రాకపోతే రైతులతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధమని రైతు అనుమోలు గాంధీ హెచ్చరించారు.