10వ తేదీ వరకు బయటకు వెళ్లొద్దు ...47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం .. వాతావరణ శాఖ హెచ్చరిక
Recommended Video
తెలుగు రాష్ట్రాలలో ప్రచండ భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడుతున్నారు . బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో వాతావరణ శాఖాధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు . నేడు , రేపు అంటే సోమ, మంగళవారాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని , మధ్యాహ్నం వేళల్లో బయట తిరగొద్దు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు .
నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు..
45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం... తస్మాత్ జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖ
రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పులు ఉంటాయని,45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. విపరీతమైన వడగాలులతో బయట తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనం ఇస్తున్నాయి. ఇక ఆస్పత్రుల్లో వడదెబ్బ బాధితులు కూడా పెరుగుతున్నారు. ఇంట్లో కూర్చుంటేనే నిప్పుల కొలిమిలో ఉన్నట్టు ఉంటుంది .
గత ఏడాదితో పోలిస్తే మరింత ఎక్కువగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు
గత సంవత్సరం తో పోలిస్తే ఈ ఏడాది ఎండలు మరింత మంట పుట్టిస్తున్నాయి. రోడ్ల మీద ఆమ్లెట్లు , రోడ్ మీద ఉన్న వేడికి బజ్జీలు వేసేంతగా పరిస్థితి ఉంది అంటే ఎంతగా ఉష్ణోగ్రతలు పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు . అందుకే వాతావరణ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుని ఎండల నుండి కాపాడుకోమని సూచిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తుంది.
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు అవసరం
ఈనెల పదో తేదీ వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది.. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గొడుగు, టోపీ , లేదంటే తలపై వస్త్రం కప్పుకోకుండా బయటకు రావొద్దన్నారు. తెల్లటి కాటన్ వస్త్రాలు శ్రేయస్కరం అని నల్లటి దుస్తులు అసలే వాడొద్దు అని సూచిస్తున్నారు.
మధ్యాహ్నం సమయాల్లో బయటకు రాకండి .. వీలైనంత ద్రవ పదార్ధాలు తీసుకోండి..
మధ్యాహ్నం ఎండ సమయాల్లో బయటకు రావద్దు అని , వృద్ధులు, పిల్లలు ఎండలో బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు చెప్తున్నారు . వీలైనంతగా ద్రవ పదార్ధాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వడదెబ్బ తగిలినట్టు గుర్తిస్తే వెంటనే తడిబట్టతో తుడిచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి .