ఏపీలో దారుణం: ప్రాణం పోసారు..ఆ వెంటనే ప్రాణం తీసిన వైద్యుడు..నర్సు
ఆ వైద్యుడు..నర్సు ఓ శిశువుకు ప్రాణం పోసారు. ప్రాణం పోసిన వారే ఆ శిశువును మానవత్వం లేకుండా రోడ్డున పడేసారు. ఆ శిశువుకు జన్మ ఇచ్చింది ఎవరో తెలిసినా..తాము పడేసిన శిశువునే తమకు రోడ్డు మీద దొరికిందంటూ డ్రామాలు ఆడారు. ఆస్పత్రిలో చేర్చారు. శిశువు ఆరోగ్యం క్షీణించడంతో వైద్యం నిమిత్తం విజయయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ శిశువు మరణించిందని దీంతో ఈఘటనపైన అనుమానంతో పోలీసులు కూపీ లాగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అసలు దోషులు ఆ వైద్యుడు..నర్సు అని తేల్చారు. రోజుల శిశువు మృతి కేసులో వైద్యుడిని, ఆయనకు సహకరించిన నర్సును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
అమానవీయంగా వ్యవహరించిన డాక్టర్..
మొవ్వ మండలం కూచిపూడి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి గర్భం దాల్చడం, అనారోగ్యం పాలై మచిలీపట్నంలోని డాక్టర్ శ్రీనివాసచార్య వద్దకు వైద్యం సేవల కోసం రాగా ఆయన మచిలీపట్నంలోని మహిళా డాక్టరు వద్దకు యువతిని పంపారు. అక్కడ వైద్యుడు..నర్సు సిబ్బందితో కలిసి ఆ యువతికి ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీసారు. అయితే..అసలు కారణాలు ఏంటనేది చెప్పకపోయినా.. అనంతరం శిశువును రోడ్డుపై పడవేసి అక్కడ దొరికినట్లుగా కథ అల్లే ప్రయత్నం చేసారు. అయితే..ఆ శిశువు చనిపోవటంతో దీని పైన పోలీసులు ఆరా తీసారు. అసలు విషయం బయటకు వచ్చింది. వాస్తవాలు తెలుసుకొని పోలీసులే నివ్వెర పోయారు.
అనాధ శిశువు అంటూ కట్టు కధ..
తామే డెలివరీ చేసి తీసిన శిశువును వదిలేసిన వైద్యుడు..నర్సు గురించి పోలీసుల విచారణలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈనెల 1న బచ్చుపేట వెంకటేశ్వరస్వామి గుడి సమీపంలో రోజుల వయసున్న ఆడ శిశువును ఎవరో వదలి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన నర్సు బేబీరాణి శిశువును వైద్యసేవల నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లింది. అయితే ఆ శిశువు ఆరోగ్యం క్షీణించడంతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ శిశువు మరణించింది. శిశువు మరణించిన సంఘటనపై విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి వచ్చిన వివరాలను ఆధారంగా చేసుకుని మచిలీపట్నం పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేశారు. చిలకలపూడి సీఐకు ఈ కేసు దర్యాప్తు భాద్యతలను అప్పగించారు.
అసలు విషయం ఏంటంటే..
ఈనెల 1న బాలాజీ నర్సింగ్ హోం డాక్టరు శ్రీనివాసాచార్య, నర్సు బేబీరాణి మరికొంత మంది సహాయంతో రోజుల వయసున్న శిశువును వెంకటేశ్వరస్వామి గుడివద్ద పడవేసినట్లు నిర్ధారణ అయిందని సీఐ వెంకటనారాయణ తెలిపారు. నర్సు బేబీరాణి తనకు రోడ్డు పక్కన శిశువు దొరికందని చెప్పి వైద్యసహాయం కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లినట్లుగా తమ దర్యాప్తులో తేలిందన్నారు.
శిశువు ఆరోగ్యం క్షీణించడంతో వైద్యం నిమిత్తం విజయయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ శిశువు మరణించిందని దీంతో ఈఘటనపై కూపీ లాగడంతో అసలు విషయం బటయకు వచ్చిందని పోలీసులు చెప్పారు. అయితే..శిశువుకు జన్మనిచ్చిన ఆ మహిళ ఎవరు..వీరు ఎందుకు ఆ శిశువును రోడ్డు మీద వదిలేసారు.. ఆ సంబంధాలు ఏంటనే కోణంలో ఇప్పుడు విచారణ సాగుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారం మాత్రం మచిలీపట్నంలో చర్చనీయాంశంగా మారింది.