ఆడపిల్ల అని తెలిసి మహిళకు అబార్షన్: వైద్యుడి అరెస్టు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ మహిళకు అబార్షన్ చేసిన వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన దుర్గాదేవికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
మూడోసారి గర్భం దాల్చిన ఆమెకు భర్త, అత్తమామ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లి స్కానింగ్ చేయించారు. ఆడపిల్ల అని తేలడంతో డాక్టర్ లక్ష్మణస్వామి ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. దుర్గాదేవి తీవ్రఅస్వస్థతకు గురి కావడంతో విషయం వెలుగు చూసింది.
బాలుడి కిడ్నాప్
గుంటూరు జిల్లా పొన్నూరులో కరీముల్లా అనే ఐదేళ్ల బాలుడిని గుర్తతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ బాలుడి తల్లిదండ్రులను కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తన ఇంటి నిర్మాణ పనులు చేసేందుకు వచ్చిన వారే తమ బాలుడిని కిడ్నాప్ చేశారని పోలీసులకు బాలుడి తండ్రి ఫిర్యాదు చేశారు.
ఇదిలావుంటే, గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ ఢీకొంది. ఈ సంఘటనలో ఒకరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర అకస్మాత్తుగా ఆటోపై ఓ చెట్టు విరిగిపడింది. చెట్టు విరిగిపడిన సమయంలో ఆటోలో ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.