కమిషన్ కోసం నగదు మార్పిడి: 46లక్షల కొత్త నోట్లు సీజ్, వైద్యుడి అరెస్ట్
మిషన్ కోసం పాత నోట్లు మార్చేందుకు యత్నించిన ఓ వైద్యుడితో పాటు ఇద్దరు వ్యక్తులను విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
విశాఖపట్నం: కమిషన్ కోసం పాత నోట్లు మార్చేందుకు యత్నించిన ఓ వైద్యుడితో పాటు ఇద్దరు వ్యక్తులను విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.46 లక్షల విలువ చేసే రూ.2000 నోట్లు, మరో లక్ష రూ.100 నోట్ల(మొత్తం రూ.47లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యునిగా పనిచేస్తున్న అన్నే శిరీష్ పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ సంపాదించాడు. దీన్ని 30 శాతం కమిషన్కు పాత కరెన్సీగా మార్చి, దాన్ని గడువులోగా రిజర్వ్బ్యాంకులో జమ చేసి వైట్గా మార్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. దీనిలో భాగంగా నగరానికే చెందిన ఇద్దరు వ్యక్తులతో బేరం కుదుర్చుకున్నాడు.
శంకరమఠం రోడ్డులో నివాసం ఉంటున్న ఎం.సూర్యప్రసాద్ రెడ్డి, బి.శ్రీనివాసరావులతో సంప్రదించాడు. వీరి నుంచి 30శాతం కమిషన్ తీసుకునే విధంగా పాత కరెన్సీని తీసుకునే ప్రయత్నం చేశాడు. తన వద్దనున్న కరెన్సీతో శంకరమఠంలోని ప్రసాద్ రెడ్డి ఇంటికి చేరుకోగా.. అప్పటికే సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు తన బృందంతో దాడిచేశారు.
వైద్యుడు శిరీష్ నుంచి కరెన్సీ మొత్తం రూ.47 లక్షల నగదుతో పాటు ప్రసాద్ రెడ్డి, శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకున్నారు. వైద్యుడు శిరీష్ వద్ద అంత మొత్తం కొత్త కరెన్సీ ఏ విధంగా వచ్చిందన్న అంశంపై కూడా ఆదాయపుపన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టారు.
బ్యాంకుల్లో నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలున్న తరుణంలో ఇంత మొత్తంలో కొత్త రూ.2000 నోట్లు సేకరించడంలో శిరీష్ అక్రమాలకు పాల్పడి ఉంటారని అధికారులుఒక అంచనాకు వచ్చారు. అంతేగాక, అతనికి బ్యాంకు అధికారులు కూడా సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు.