వైద్యుడి ఘాతుకం: పేషంట్లకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు! వివాహిత ఫిర్యాదుతో..
కర్నూలు: అతడో నకిలీ డాక్టర్. వైద్య విద్య చదవనే లేదు. అయినా సరే క్లినిక్ పెట్టేశాడు. ఎడాపెడా పైల్స్(మొలలు) అపరేషన్లు చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో మొలలకు అతడు మందులు మాత్రమే ఇచ్చేవాడు. అయితే రానురాను రోగుల పల్స్ తెలుసుకున్నాడు. మొలల సమస్యతో తన వద్దకు వచ్చే వారికి ఏకంగా శస్త్రచికిత్సలే చేయడం ప్రారంభించాడు. ఇది కూడా నేరమే!
ఈ నకిలీ డాక్టర్ అక్కడితో ఆగలేదు. మొలల సమస్యతో తన వద్దకు వచ్చే యువతులకు మత్తుమందు ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా అతడి అఘాయిత్యానికి బలైపోయిన అబలలెందరో. కన్నీటిని తమలో తామే దిగమింగుకుని మౌనంగా ఉండిపోయారు. కానీ కాలం ఎప్పుడూ దుర్మార్గులకు అనుకూలించదు కదా! ఈ మధ్య ఓ బాధితురాలు ధైర్యం చేసి ఇతడి అరాచకాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. అంతే - ఆ తీగలాగితే ఇప్పుడు వీడి డొంకంతా కదులుతోంది.
మొలల వైద్యుడి ముసుగులో...
పదిహేనేళ్ల క్రితం కర్నూలు జిల్లాకు వలస వచ్చిన ఓ కామాంధుడు వైద్యుడి అవతారం ఎత్తాడు. పత్తికొండ పట్టణంలో మొలల వైద్యుడిగా క్లినిక్ ప్రారంభించాడు. మొదట్లో మొలలు తగ్గేందుకు మందులు మాత్రమే ఇచ్చిన ఈ వైద్యుడు ఆ తరువాత శస్త్ర చికిత్సలు కూడా చేయడం ప్రారంభించాడు. ఇతడు శస్త్ర చికిత్స చేసిన ఒకరిద్దరు మృతి చెందినట్లు సమాచారం. అయితే సరే ఇతడు ఆ వృత్తిని మానుకోలేదు. రోగులను తన మాటలతో భయపెట్టి వారికి శస్త్రచికిత్సలు చేస్తూ భాగానే సంపాదించేవాడు.
రోగులను మాటలతో బెదరగొట్టి...
మొలల సమస్యతో తన వద్దకు వచ్చే వారిని ముందుగా తన మాటలతో బెదరగొట్టేవాడు. శస్త్ర చికిత్స చేయించుకోకపోతే బతకడమే కష్టమనేవాడు. దీంతో వాళ్లు భయపడిపోయి శస్త్ర చికిత్సలకు ఒప్పుకునే వారు. ఇలా మొలల ఆపరేషన్లకు ఒక్కో రోగి ద్వారా రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేసేవాడు. ప్రాణభయంతో రోగులు అతడు అడిగినంత ఇచ్చి మొలల ఆపరేషన్ చేయించుకునే వారు.
మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు...
అర్హత లేకపోయినా వైద్యం చేస్తూ.. వేల రూపాయలు సంపాదించడమేకాకుండా మొలల సమస్యతో తన వద్దకు వచ్చే మహిళలకు శస్త్ర చికిత్స పేరిట మత్తుమందు ఇచ్చి వారిపై ఇతగాడు అత్యాచారాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మత్తు దిగాక వారికి విషయం అర్థమైనా బయటికి చెప్పుకుంటే తమ పరువే పోతుందని, కాపురం కూలిపోతుందనే భయంతో పలువురు మహిళలు మౌనంగా ఆ బాధను తమలో తామే దిగమింగుకునే వారు. అయితే ఇటీవల ఓ యువతి విషయంలోనూ ఇలాగే జరగ్గా.. ఆమె తన కుటుంబ సభ్యుల సహాకారంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదుతో క్లినిక్ మూసేసి...
కొద్దిరోజుల క్రితం మొలల శస్త్ర చికిత్స కోసం వచ్చిన ఓ యువతితో కూడా ఈ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా కేంద్రం నుంచి రెండు టీంలు ఇప్పటికే సదరు వైద్యుడి క్లినిక్ వద్దకు వచ్చి ఆరా తీసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారం కిందట సదరు నకిలీ వైద్యుడు తన క్లినిక్ మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా తన ఇంటి వద్దే క్లినిక్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.