కర్నూలు:డోన్ లో ప్రముఖ వైద్యుడు దారుణ హత్య...కలకలం
కర్నూలు:జిల్లాలోని డోన్ పట్టణంలో ప్రముఖ వైద్యుడు పోచ శ్రీకాంత్రెడ్డి(47) దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు...
డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గురువారం తన ఇంట్లో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఓ వ్యక్తికి ప్రాణాపాయంలో ఉన్నాడని, అర్జంటుగా వైద్యం చేయాలని వెంటబెట్టుకొని ఆటోలో తీసుకెళ్లారు. అలా వారితో వెళ్లిన శ్రీకాంత్రెడ్డి గురువారం రాత్రి ఎంత పొద్దుపోయినా ఇంటికి తిరిగిరాక పోయేసరికి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. దీంతో శ్రీకాంత్రెడ్డి కోసం గురువారం రాత్రి నుంచి గాలింపు మొదలుపెట్టారు.
ఈక్రమంలో శుక్రవారం ఉదయం డోన్ లోనే ఇండోర్ స్టేడియం సమీపంలో శ్రీకాంత్ రెడ్డి మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. కొన్ని గంటల క్రితమే ఇంటి నుంచి వైద్యం చేసేందుకని వెళ్లిన శ్రీకాంత్ రెడ్డిని అంతలోనే శవంగా మారి కనిపించటంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. శ్రీకాంత్రెడ్డిని ఆటోలో తీసుకువెళ్లిన వ్యక్తులే అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
శ్రీకాంత్ రెడ్డికి వైద్యుడిగా పట్టణంలో మంచి పేరు ఉండటంతో ఆయన హత్య కలకలం రేపింది. డాక్టర్ హత్యకు గురైన సమాచారం తెలిసిన వెంటనే డీఎస్పీ బాబా ఫకృద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తండ్రి పోచ ప్రభాకర్రెడ్డి కూడా వైద్యులే కాగా ఆయన స్థానికంగా టిడిపిలో యాక్టివ్ నేతగా ఉన్నట్లు తెలుస్తోంది. హత్యకు గురైన శ్రీకాంత్రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.