రమేష్ ఆస్పత్రి ఉద్యోగుల కస్టడీ నిరాకరణ- హైకోర్టును ముందస్తు బెయిల్ కోరిన రమేష్బాబు...
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో కీలకంగా ఉన్న రమేష్ ఆస్పత్రి యాజమాన్యం విషయంలో ఇవాళ రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్వర్ణప్యాలెస్ ఘటనకు బాధ్యులను చేస్తూ ఇప్పటికే అరెస్ట్ చేసిన రమేష్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ ఐదో మెట్రోపాలిటన్ కోర్టు నిరాకరించింది. దీంతో వీరు రిమాండ్లో కొనసాగనున్నారు.
అదే సమయంలో కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్న రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబు ఇవాళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రమేష్ ఆచూకీ కోసం ఇప్పటికే విజయవాడ పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరి గాలింపు కొనసాగుతుండగానే డాక్టర్ రమేష్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.
స్వర్ణ ప్యాలెస్ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన రెండు వేర్వేరు విచారణ కమిటీలు తమ నివేదికలు అందజేశాయి. ఇందులో రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని తేలింది. దీంతో రమేష్ ఆస్పత్రి సీజ్కు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ డాక్టర్ రమేష్ బాబుపైనా తీవ్ర కేసులకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ కేసులో విజయవాడ పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ డాక్టర్ రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ 21వ తేదీన జరగవచ్చని తెలుస్తోంది.