సమరం తేల్చేశారు: రాజేశ్ ఉదంతంతో తెర పైకి కొత్త ప్రశ్నలు.., ఆ ఒత్తిడే?, యువకుల్లోను భయం..
Recommended Video
చిత్తూరు: 'శాడిస్ట్ మొగుడు' కథనాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనే లేవనెత్తాయి. తొలిరాత్రే నవ వధువు పట్ల అత్యంత కిరాతకంగా దాడి చేసిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
శాడిస్ట్ భర్త కేసులో కొత్త మలుపు, నోటీసులు!: నపుంసకత్వంపై ఆయన ఎక్కడా చెప్పలేదు కానీ
పెళ్లంటే.. ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటారు.. కట్న కానుకల గురించి మాట్లాడుకుంటారు.. ఏ ఫంక్షన్ హాల్ అయితే బాగుంటుంది?, ఏ ముహూర్తం బాగుంటుంది? లాంటి విషయాలన్ని మాట్లాడుకుంటారు. కానీ పెళ్లికి మానసికంగా, శారీరకంగా వధువు, వరుడు ఇద్దరూ సిద్దంగా ఉన్నారా? అంశాన్ని మాత్రం అన్ని కుటుంబాలు విస్మరిస్తున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.
రాజేష్ ఉదంతంతో:
శాడిస్ట్ మొగుడు రాజేష్ ఉదంతంతో అనేక ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. భార్య శైలజతో తొలిరాత్రే 'నేను నపుంసకుడిని' అని చెప్పడం వెనుక పలు ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై డాక్టర్ సమరం స్పందిస్తూ.. ఒకటి అతనికి ఆత్మవిశ్వాసమైన లేకపోయి ఉండాలి, లేదా పెళ్లికి ముందే మరో స్త్రీ వద్దకు వెళ్లి.. ఆమెతో సరిగా గడపలేక 'నువ్వు సంసారానికి పనికిరావు' అన్న ముద్ర అన్న వేయించుకుని ఉండాలి అని చెప్పారు. ఈ రెండు కారణాల వల్లే తొలిరాత్రి అతనలా ప్రవర్తించి ఉండవచ్చునని అన్నారు.
సైకాలజికల్ డిసార్డర్:
రాజేష్ కేసును కేవలం నపుంసకత్వం కోణంలో చూడవద్దని, శైలజపై దాడి చేసిన తీరు చూస్తుంటే అతనిలో 'సైకాలజికల్ డిసార్డర్స్' ఉన్నట్లు అర్థమవుతోందని అన్నారు. ఒక సైకో తరహాలో రాజేష్ శైలజపై దాడి చేశాడని, ఇది అత్యంత హేయమైన చర్య అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని చెప్పారు.
ఆ టెస్టులతో 'నో యూజ్':
శైలజపై దాడి నేపథ్యంలో రాజేష్ లైంగిక సామర్థ్యానికి సంబంధించిన పరీక్షలు చేయడానికి రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై డా.సమరం వాదన మాత్రం మరోలా ఉంది. లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించిన మాత్రానా ఎలాంటి ఫలితం ఉండదని అంటున్నారు.
లైంగిక సామర్థ్యానికి సంబంధించి హార్మోనల్ టెస్టు, ఎరక్టయిల్ డిస్ఫంక్షన్ లాంటి పరీక్షలు చేస్తారని.. చాలాసార్లు అందులో 'నార్మల్' అనే వస్తుందన్నారు. సమస్య టెస్టులతో తేలదని, ఎందుకంటే ఇది 'పెర్ఫామెన్స్'కు సంబంధించిన విషయమని అన్నారు. రిపోర్టులు నార్మల్ గా ఉన్నంత మాత్రానా.. అతను పడకగదిలో తగిన రీతిలో పెర్ఫామెన్స్ చేయకపోవచ్చునని తెలిపారు.
యువకుల్లోను కొత్త భయం:
శాడిస్ట్ మొగుడు రాజేష్ ఉదంతం తర్వాత లైంగిక సామర్థ్యంపై అనుమానంతో పలువురు యువకులు తనను సంప్రదిస్తున్నట్లు సమరం పేర్కొనడం గమనార్హం.
ఈ సంఘటన తర్వాత పెళ్లంటేనే యువకులు భయానికి లోనయ్యే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సాంప్రదాయలు, ముహూర్తాల పేరుతో... ఒక 'టైమ్' ఫిక్స్ చేసి మరీ సరిగ్గా ఆ సమయంలోనే కలయిక జరగాలని ఇరు కుటుంబాలు వధువరులపై ఒత్తిడి తేవడం కూడా యువకుల్లో భయాన్ని పెంచుతోందని సమరం అన్నారు.
ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై.. ఆ సమయానికి వారు సరైన రీతిలో శృంగారంలో పాల్గొనలేకపోతున్నారని, ఇక అది మొదలు వారి దాంపత్య జీవితంలో అసంతృప్తి, అసహనం పేరుకుపోతుందని సమరం తెలిపారు. కాబట్టి తొలిరాత్రే కలయిక జరగాలన్న ఒత్తిడిని పక్కనపెట్టి వధువరుల మధ్య మంచి ఇంటారక్షన్ జరిగే వాతావరణాన్ని క్రియేట్ చేయాలని సమరం సలహా ఇస్తున్నారు.