డాక్టర్ శిల్ప ఆత్మహత్య, ఫ్యామిలీని పరామర్శించిన రోజా: సోదరి ఫిర్యాదు, రవిపై వేటు
చిత్తూరు: జిల్లాలోని పీలేరులో ముప్పయ్యేళ్ల మహిళా డాక్టర్ శిల్ప అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంట్లో ఉరేసుకొని ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించారు. గతంలో తిరుపతి రుయాలో పీజీ చేస్తుండగా శిల్పాకు వేధింపులు వచ్చాయి. డాక్టర్ల వేధింపులపై ఆమె గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా వేధించిన డాక్టర్లపై చర్యలు తీసుకోలేదని ఆమె మనోవేధనకు గురయ్యారు. ఆ తర్వాత పీజీలో ఫెయిలయ్యారు. దీంతో ఆత్మత్య చేసుకుందని చెబుతున్నారు.
డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై ఆమె సోదరి కృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రొఫెసర్ రవి కుమార్, డాక్టర్ శివకుమార్లపై ఫిర్యాదు చేశారు. రవికుమార్, శివకుమార్ల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆరోపణల నేపథ్యంలో ఎస్వీ మెడికల్ కాలేజీ డాక్టర్ రవి కుమార్పై డీఎంఈ చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేశారు. అయితే డీఎంఈ ఆదేశాలపై జూనియర్ డాక్టర్లు పెదవి విరిచారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని కాకుండా ఒక్క రవికుమార్నే సస్పెండ్ చేయడం ఏమిటని ఆగ్రహిస్తున్నారు. మిగతా ఇద్దరు డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు.
శిల్ప కుటుంబాన్ని పరామర్శించిన రోజా
పీలేరులో డాక్టర్ శిల్ప కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు. శిల్పది ఆత్మహత్య కాదని, టీడీపీ ప్రభుత్వ హత్యే అన్నారు. ముగ్గురు నిందితులను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆయనకు ఆడబిడ్డల బాధలు తెలియవన్నారు.
శిల్ప ఆత్మహత్యపై విచారణ కమిటీ
డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణకు హైలెవల్ కమిటీని ప్రభుత్వం వేసింది. డీఎంఈ కే బాబ్జీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. బుధవారం (8 ఆగస్ట్ 2018) త్రిసభ్య కమిటీ విచారణ జరపనుంది.
పెళ్లిప్రేమ పెళ్లి
శిల్ప తిరుపతికి చెందిన రూపేష్ కుమార్ రెడ్డిని అయిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. శిల్ప తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో చిన్న పిల్లల వైద్య విభాగంలో పీజీ పూర్తి చేశారు. రూపేష్ పీలేరులో ఎముకల డాక్టర్గా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అయితే శిల్ప పీజీ చేసిన సమయంలో కాలేజీలోని అధ్యాపకులు తనను మానసికంగా వేధిస్తున్నారని శిల్ప గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు.
నిన్న వేధింపులు.. తాజాగా ఫెయిల్
అధికారులు ఆ ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో నేరుగా గవర్నర్కు లేఖ రాశారు. పీజీ వైద్య విద్యార్థిని అని కూడా చూడకుండా అధ్యాపకులు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లు లేఖలో అప్పుడు పేర్కొంది. దీనిపై స్పందించిన గవర్నర్ అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణ కమిటీ కళాశాలకు వచ్చి వివరాలు సేకరించింది. దీనికి సంబంధించి తుది నివేదిక నేరుగా జిల్లా కలెక్టర్కు చేరింది. ఆ నివేదికను కలెక్టర్ గవర్నర్ కార్యాలయానికి పంపించారు. ఈ నేపథ్యంలోనే ఆమె పీజీలో ఫెయిలైనట్లు తెలిసింది. దీంతో శిల్ప మనస్థాపానికి గురైందని అంటున్నారు. బెడ్రూంలో తాడుతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కావాలనే ఫెయిల్ చేశారని ఆవేదన
స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తనపై వేధింపుల విషయంలో న్యాయం జరగలేదని, ఇక తనకు చావే శరణ్యమని శిల్ప గతంలో తన ఫ్రెండ్స్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆమె మీడియాకు కూడా చెప్పారు. అదే సమయంలో ఫెయిలైనట్లు తెలిసింది. పీజీ పరీక్షలో తనను కావాలనే ఫెయిల్ చేసినట్లుగా ఆమె భావించి ఉంటారని అంటున్నారు.