డా.సుధాకర్ కోసం టీడీపీ ‘చలో విశాఖ’.. ‘బేరసారాల’పై మంత్రి సురేశ్ సవాలు..
మాస్కుల వివాదంలో సస్పెన్షన్కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం వైజాగ్ మెంటల్ ఆస్పత్రిలో ఉన్న సుధాకర్ కు ప్రభుత్వం సరైన వైద్యం అందించడంలేదని, కేసులు వాపస్ తీసుకునేలా డాక్టర్ తల్లితో మంత్రి ఆదిమూలపు సురేశ్ బేరసారాలు సాగిస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. దీనిపై ఘాటుగా స్పందించిన మంత్రి.. ఆరోపణలు నిరూపించాలంటూ టీడీపీకి సవాలు విసిరారు.
మాస్కులు అడిగిన పాపానికి దళితుడైన డాక్టర్ సుధాకర్ను బలి చేసేందుకు వైసీపీ సర్కారు కుట్ర పన్నిందని, లేని పిచ్చిని తగ్గించే పేరుతో డాక్టర్ ను నిజంగానే పిచ్చివాణ్ని చేసేలా తప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారని, సుధాకర్ ను ట్రీట్ చేస్తున్న డాక్టర్లతో ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి సురేశ్ ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారని వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. సర్కారీ వైద్యులపై నమ్మకం లేదని, సుధాకర్ కేసును వెంటనే ప్రైవేటు డాక్టర్లకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సుదాకర్కు వైద్యం అందించడంలో పారదర్శకంగా వ్యవహరించకపోతే టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు 'చలో విశాఖ' కార్యక్రమాన్ని చేపడతాయని వర్ల తెలిపారు.
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంలో టీడీపీ చేస్తోన్న ఆరోపణలను మంత్రి సురేశ్ ఖండించారు. ఆదివారం మార్కాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ''డాక్టర్ తోగానీ, వాళ్ల అమ్మతోగానీ నేను మాట్లాడలేదు. అలా చేశానని ఎవరైనా నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. మరి ఆరోపణల్ని రుజురుచేయడానికి టీడీపీ వాళ్లు సిద్ధమేనా?''అని సవాలు విసిరారు.
Recommended Video
మేనేజ్ అనే పదానికి మరో అర్థమే టీడీపీ అని, దేన్నైనా, ఎవరినైనా మేనేజ్ చేయగల సమర్థులు టీడీపీ వాళ్లేనని మంత్రి సురేశ్ ఎద్దేవా చేశారు. వర్ల రామయ్య, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్లను అడ్డుపెట్టుకొని దళితులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని, నిజానికి అసలైన దళితద్రోహి చంద్రబాబేనని, దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పటిదాకా క్షమాపణ చెప్పనేలేదని మంత్రి అన్నారు.