వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు: డాక్టర్పై పోలీసుల దాడి..ఇదేనా రాజన్న రాజ్యం?
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు. స్టెథెస్కోప్లను పక్కకు పెట్టిన వైద్యులు రోడెక్కారు. తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అలిపిరిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. అయితే రంగంలోకి దిగిన ఖాకీలు వారి ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జూనియర్ డాక్టర్లకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ పోలీసు జూనియర్ డాక్టర్పై చేయి చేసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమ నిరసనలో భాగంగా కొండపైకి వెళ్లే భక్తులను అడ్డుకునే ప్రయత్నం చేశారు జూనియర్ డాక్టర్లు. నిరసనకు దేవునికి ముడిపెట్టరాదని భక్తులు కోరారు. దీంతో భక్తులకు జూనియర్ డాక్టర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక జూనియర్ డాక్టర్లు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్కు భారీ అంతరాయం ఏర్పడింది. మరోవైపు విజయవాడలో నిరసన తెలుపుతున్న పలువురు డాక్టర్లను అరెస్టు చేసిన పోలీసులు వెంటనే విడుదల చేయాలంటూ తిరుపతిలో ఆందోళన చేపట్టిన డాక్టర్లు డిమాండ్ చేశారు.
డాక్టర్ల ఆందోళన రాజకీయ రంగు పులుముకుంది. నిరసన తెలుపుతున్న డాక్టర్లపై ఒక డీసీపీ చేయిచేసుకోవడమేంటంటూ మాజీ ముఖ్యమంత్రి ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఆ వీడియోను కూడా ఆయన తన ట్విటర్లో పోస్టు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళన చేపట్టినా వారిపై వైసీపీ ప్రభుత్వం అసహనానికి గురువుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదేనా వైసీపీ నాయకులు చెబుతున్న రాజన్న రాజ్యం అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు చంద్రబాబు.
సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళన చేపట్టినా వైసీపీ ప్రభుత్వం అసహనానికి గురవుతోంది. ఎన్ ఎమ్ సీ బిల్లుపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదేనా రాజన్నరాజ్యం? ప్రజల గొంతునొక్కే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. pic.twitter.com/7PFHzVp97f
— N Chandrababu Naidu (@ncbn) August 7, 2019
నడిరోడ్డు మీద ఒక దొంగనో, రౌడీనో కొట్టినట్లు ఒక డాక్టరును కొడుతున్నారంటే ప్రభుత్వ దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్.ఆందోళనలు కఠినంగా అణిచివేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ఈ నిరంకుశ చర్యలను టీడీపీ ఖండిస్తోందంటూ ట్విటర్ వేదికగా వీడియోను పోస్టు చేస్తూ రాశారు నారాలోకేష్.
ఇదిలా ఉంటే నారాలోకేష్ ట్వీట్కు పలువురు సమాధానం ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఆందోళన చేసినప్పుడు బషీర్బాగ్ దగ్గర ముగ్గురు రైతులు పోలీసుల తూటాలకు బలైన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు చంద్రబాబు ఆదేశాల మేరకే ఇవి జరిగాయని అనుకోవచ్చా అంటూ ప్రశ్నించారు.