విషపదార్థాల్లేవు, తగ్గడానికి నెలన్నర పడుతుంది: డాక్టర్లు, ఐనా జగన్ పాదయాత్ర!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గాయాన్ని మంగళవారం డాక్టర్లు పరిశీలించారు. గాయం ఇంకా తగ్గలేదని చెప్పారు. పూర్తిగా తగ్గడానికి నెలన్నర సమయం పడుతుందని తెలిపారు. లోటస్పాండ్లో డాక్టర్లు ఆయనను సిటీ న్యూరో సెంటర్ డాక్టర్లు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబూ! స్నేహితుడి కొడుకుపై ఇలానా: జగన్ మీద దాడి ఘటనపై లక్ష్మీపార్వతి ఆగ్రహం
కోడి కత్తితో చేసిన గాయంపై రక్త నమూనాల నివేదిక వచ్చిందని డాక్టర్ శివారెడ్డి చెప్పారు. అందులో ఎలాంటి విషపదార్థాలు లేవని గుర్తించినట్లు చెప్పారు. పాదయాత్రకు వెళ్లాలనే అభిప్రాయంతోనే జగన్ ఉన్నారని, కొన్ని జాగ్రత్తలతో పాదయాత్ర చేయవచ్చునని సూచించామన్నారు.
విషపూరితమైనవి లేవు
దాడి చేసిన కత్తికి సంబంధించిన టాక్సీకాలజీ రిపోర్టులో అల్యూమినియం వాడినట్లు నివేదిక వచ్చిందని డాక్టర్లు చెప్పారు. కత్తికి విషపూరితమైనవి ఏమీ లేవన్నారు. జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, బీపీ కంట్రోల్లో ఉందని చెప్పారు.
గాయంతో నవంబర్ 3 నుంచి పాదయాత్ర ప్రారంభం
వైసీపీ అధినేత వైయస్ జగన్ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. కానీ ఇది పూర్తిగా మానడానికి ఆరు వారాల సమయం పట్టనుంది. అప్పటి వరకు ఆయన పాదయాత్రను నిలిపి వేసేందుకు ఆసక్తిగా లేరు. వారంకు పైగా పాటు పూర్తిస్థాయి విశ్రాంతి అనంతరం నవంబర్ 3వ తేదీ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు. కత్తి దాడి తర్వాత జాగ్రత్తలతో ఆయన పాదయాత్ర చేయనున్నారు.
శ్రీనివాస రావు ఇచ్చిన సమాచారంతో వివిధ ప్రాంతాల్లో దర్యాఫ్తు
జగన్పైన దాడి ఘటనకు సంబంధించి విశాఖపట్నం పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. నిందితుడు శ్రీనివాసరావును మూడోరోజు కస్టడీలోకి తీసుకున్నారు. అతనిని పలు కోణాల్లో విచారించారు. అతడు పనిచేసే హోటల్ సిబ్బందిని సైతం ప్రశ్నిస్తున్నారు. ఘటనకు రెండురోజుల ముందు నుంచి నిందితుడికి సంబంధించిన కాల్డేటాను పోలీసులు సేకరించారు. దీని ఆధారంగా హైదరాబాద్, తూర్పు గోదావరి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లి దర్యాప్తు చేయనున్నారు.
ఎవరికి సందేశాలు పంపించాడు, ఫోన్లు చేశాడు?
దాడి జరిగిన రోజు నాటి సీసీ కెమెరాలను పరోసారి పరిశీలించారు. శ్రీనివాసరావు అంతకుముందు ఎవరెవరితో మాట్లాడాడో ఆరా తీస్తున్నారు. ఎవరికైనా సందేశాలు పంపించారో చూస్తున్నారు. నవంబర్ 2తో నిందితుడి పోలీస్ కస్టడీ ముగియనుంది. దీంతో అతని నుంచి ఈ ఐదు రోజుల్లో అన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ ఏసీపీ, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలతో కూడిన సిట్ ఈ కేసును విచారిస్తోన్న విషయం తెలిసిందే.
వాంగ్మూలానికి వైసీపీ నేతలు నో
మరోవైపు, ఈ కేసుకు సంబంధించి జగన్ పైన దాడి జరిగిన సమయంలో ఉన్న వైసీపీ నేతలకు ఇప్పటికే నోటీసులు పంపించారు. కానీ ఒక్క వైసీపీ నాయకుడు కూడా వాంగ్మూలం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించి వైసీపీ నేతల వాంగ్మూలం సేకరించే అవకాశముంది.