చంద్రబాబుకు మరో షాక్ తగలనుందా?...చల్లా వైసిపిలో చేరతారా?
ఏపీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుకి మరో పెద్ద షాక్ తగలనుందా?...కర్నూలు జిల్లా ప్రముఖ టిడిపి నేత చల్లా రామ కృష్ణారెడ్డి ఈ షాక్ ఇవ్వనున్నారా? అంటే అవుననేట్లుగానే కనిపిస్తున్నాయి ఆయన వ్యాఖ్యలు.
చంద్రబాబు రెండు రోజుల క్రితం చల్లాకి ప్రకటించిన నామినేటెడ్ పోస్టే ఆ చిచ్చు రగలడానికి కారణమైందని స్వయంగా ఆయనే చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. సిఎం చంద్రబాబు తనకు కేటాయించిన నామినేటెడ్ పదవిపై చల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు ఇంకా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ చల్లా ఏమన్నారంటే?...
చల్లా రామకృష్ణారెడ్డి...ఏమన్నారంటే...
తనకు అసలు పదవి ఇవ్వకపోయినా బాధపడేవాడిని కాదని...కానీ ఇంత చిన్న పదవి ఇచ్చి చంద్రబాబు తనను అవమానపర్చారని ఆయన తన మద్దతుదారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకన్నా ఏంతో జూనియర్ నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టి తనకు మాత్రం జిల్లా స్థాయి పదవిని కేటాయించడం ఎగతాళి చేసినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారట.
ఆ పదవిని...చేపట్టేది లేదు
అందువల్ల తన స్థాయికి తగని ఆ చిన్న పదవిని తాను చేపట్టేది లేదని ఇప్పటికే అధిష్టానానికి చల్లా రామకృష్ణా రెడ్డి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక టిడిపిలో చేరి ఎంతో క్రమశిక్షణ, నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసిన తనకు మరీ ఇంత చిన్న పదవి ఇవ్వడం ఏమిటని అని ఆయన మథనపడుతున్నారట.
సో సీనియర్...
ఐ యామ్..సో సీనియర్... ఒకే పార్లమెంట్ పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన రికార్డు తన సొంతమని చల్లా అంటున్నారట. అసలు రాయలసీమలో చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తిల తర్వాత తానే అత్యంత సీనియర్ నాయకుడినని...అలాంటి తనకు ఇచ్చే చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అని చల్లా మండిపడుతున్నారట. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేప్పుడు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చి తీసుకున్నారని, బాబు ఆ మాట తప్డమే కాకుండా ఇప్పుడు ఈ పదవి ఇచ్చి మరింత అవమానపర్చారని చల్లా రగిలిపోతున్నారట.
మరైతే...ఇప్పుడేం చేస్తారు...
చల్లా రామకృష్ణారెడ్డి తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన చంద్రబాబుకు షాక్ ఇచ్చేట్లుగానే కనిపిస్తోంది. తన భవిష్యత్తు విషయం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, వారితో చర్చిస్తానని, ఆపై వారి అభీష్టం మేరకు ఓ నిర్ణయం తీసుకుంటానని చల్లా వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. అంతేకాదు తనకు తన అనుచరుల మాటే శిరోధార్యమని, వారు ఏం చెబితే అది చేయడానికి సిద్ధమని కూడా అన్నారు. దీంతో చల్లా పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోందని, వైసిపిలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారని అనుకోవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే చంద్రబాబుకు రాజకీయంగా గట్టి దెబ్బేనని చెప్పుకోవచ్చంటున్నారు.