చంద్రబాబు ఎన్నో చేస్తే ఒక్కడికైనా గుర్తుందా ? పోలింగ్ ముందు రోజు 2వేలే ముఖ్యం .. జేసీ ఫైర్
అమ్మవార్లు టీడీపీ విజయాన్ని నిర్ణయించారు అని ఇటీవల జోస్యం చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు చేసిన మంచి ఎవరికైనా గుర్తుందా అని ఆవేదన వెళ్ళగక్కారు. అనంతపురం ఎంపీ, టీడీపీ ముఖ్యనేత జేసీ దివాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బు ఖర్చుపెట్టటం పై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
విపక్షాలు గెలిచేందుకు డబ్బులు పంచాయనుకోవచ్చు కానీ అధికారంలో ఉన్నవాళ్లు చేసిన పనులు చెప్పుకోకుండా ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాల్సివచ్చింది? అని ఓ టీవీ చానల్ లో చేసిన ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు, జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. మనిషికి గతంతో పనిలేదని, అప్పటికప్పుడు తనకు ఏం లాభం వచ్చిందన్న విషయాన్నే ఆలోచిస్తాడని అన్నారు. అంతే కాదు ఎన్నికలు జరిగిన తీరుపై జనాల సైకాలజీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలింగ్ ముందు ఇచ్చే 2 వేలే జనాలకు ముఖ్యం అన్న జేసీ
చంద్రబాబు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో 120 సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని తెలిపారు.చంద్రబాబు నదులు అనుసంధానం చేశారు, పేదలకు పెళ్లిళ్లు చేశారు, సీఎంఆర్ఎఫ్ కింద అడిగినవాళ్లకు లేదనకుండా యాబై వేలు ఇచ్చారు, బ్రహ్మాండమైన ఇన్సూరెన్స్ పథకం కూడా తీసుకువచ్చారు. ఇక ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా వచ్చిన "అంతకుముందువన్నీ తిన్నారు, అరిగిపోయింది. ఏ రోజుది ఆ రోజే అరిగిపోయింది. పోలింగ్ కు ముందు రూ.2000 మాత్రమే చాలా గొప్పది అంటూ అసహనం వ్యక్తం చేశారు .
ప్రజలపై ఇష్టారాజ్య దూషణలు చేసిన జేసీ .. ఇన్ని చేస్తే ఒక్కడికైనా గుర్తుందా అంటూ ఫైర్
చంద్రబాబు ఇన్నీ చేస్తే ఒక్కడికైనా గుర్తుందా? నాలాంటి వెధవ నా కొడుకు ఎవడో ఒక్కడు మెచ్చుకుంటున్నాడు. మిగతా నా కొడుకులకు ఎవడికీ పట్టలా! అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. చేసిన మంచిపనులు గుర్తించకపోగా, చేశాడు, అయితే! అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు" అని ఆవేదన వెళ్లగక్కారు. అయితే, ఎవరు ఎవర్ని గుర్తించినా గుర్తించకపోయినా పసుపు-కుంకుమ, రైతులకు డబ్బులు అంశాలు మాత్రం టీడీపీకి ఓట్లవర్షం కురిపించాయని జేసీ అన్నారు. కానీ జేసీ మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి.