టీడీపీ కార్యకర్తలా నిమ్మగడ్డ, మార్చి 31 తర్వాత ఆయనను కుక్క కూడా పట్టించుకోదు : మరోమారు రోజా తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు . గత ఎన్నికల సమయంలో ప్రజలు చంద్రబాబును ఓడించి టిడిపిని సమాధి చేశారని, సమాధి లో ఉన్న టిడిపిని, చంద్రబాబును పైకి లేపాలని నిమ్మగడ్డ విఫలయత్నాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. మార్చి 31 తర్వాత నిమ్మగడ్డను కుక్క కూడా పట్టించుకోదంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీని బతికించే బాధ్యత చంద్రబాబు , లోకేష్ లు నిమ్మగడ్డపై పెట్టారు
రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ ఒక పార్టీకి కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని రోజా నిమ్మగడ్డ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, నారా లోకేష్ లు టిడిపిని బతికించే బాధ్యతను నిమ్మగడ్డ పై పెట్టారని, అందుకే నిమ్మగడ్డ ఇటువంటి తల తిక్క పనులు చేస్తున్నారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇంత అసమర్థ ఎలక్షన్ కమిషనర్ ను తాను ఎక్కడా చూడలేదని రోజా నిప్పులు చెరిగారు. పదవీ విరమణ తర్వాత నిమ్మగడ్డ టీడీపీలో చేరుతారు అంటూ రోజా విమర్శలు గుప్పించారు .
ప్రజల చేత నిమ్మగడ్డ బుద్ధి చెప్పించుకునే రోజు వస్తుంది
ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇచ్చి ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తే, కావాలనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ టిడిపి కోసం పనిచేస్తూ అర్థంలేని నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోడానికి ప్రభుత్వ పథకాల అమలు కోసం ఏకగ్రీవం చేసుకుందామని గ్రామస్తులు చెబుతున్నారని, ఇది విన్న తర్వాత ఆయన తల ఎక్కడ పెట్టుకుంటారో చెప్పాలంటూ నిమ్మగడ్డను ఉద్దేశించి రోజా ప్రశ్నించారు. ప్రతి విషయానికి ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసి భయ బ్రాంతులకు గురి చేయాలని నిమ్మగడ్డ ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల చేత నిమ్మగడ్డ బుద్ధి చెప్పించుకునే రోజు వస్తుందంటూ రోజా వ్యాఖ్యానించారు.
విజయం వైసీపీ బలపరిచిన అభ్యర్ధులదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని, సర్పంచులు మెజారిటీ వైసీపీ ఉండాలని కోరుకుంటున్నారని, రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు వైసిపి బలపరిచిన అభ్యర్థులకే దక్కుతాయని రోజా పేర్కొన్నారు. ప్రతిదానికి ఏదో ఒక రాద్ధాంతం నిమ్మగడ్డ చేస్తున్నారని మండిపడిన రోజా భవిష్యత్తులో నిమ్మగడ్డ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది అంటూ హెచ్చరించారు.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్న రోజా
పోటీ చేసే అభ్యర్థులను, అధికారులను భయపెట్టాలని చూస్తే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు . రాష్ట్రంలో అత్యధిక స్థానాలు వైసీపీ బలపరిచిన అభ్యర్థులకే దక్కుతాయని పేర్కొన్న రోజా చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు. ఇక నిన్నటికి నిన్న నిమ్మగడ్డ చిన్నమెదడు చితికినట్టుంది అంటూ ఏకగ్రీవాల విషయంలో నివేదికలు కోరుతూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై రోజా నిప్పులు చెరిగారు.