గోదావరి తీరంలో ఘోరం: మహిళ హత్య, పీక్కుతిన్న కుక్కలు
పశ్చిమగోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పెనుగొండ మండలం నడిపూడిలో ఓ మహిళను హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మృతదేహాన్ని గోదావరి తీరంలో పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. కాగా, ఆ మహిళ మృతదేహం కొంత బయటికి రావడంతో కుక్కలు పీక్కుతింటూ కనిపించాయి. దీంతో ఈ దారుణం వెలుగులోకొచ్చింది.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు పెనుమంట్ర మండలం ఎస్ ఇల్లిందలప్రరు చెందిన మహిళగా తెలుస్తోంది. సోమవారం ఈ మేరకు కేసు నమోదు చేసి తహశీల్దార్ బొడ్డు శ్రీనివాసరావు సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, పాలకొల్లుకు చెందిన డాక్టర్ రామారావు బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేయించారు.
మృతురాలు 6 నెలల గర్భిణీగా నిర్ధరించారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవని మృతురాలు వయస్సు 20 నుంచి 25 సంవత్సరాలు మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు సీఐ చెప్పారు. మృతురాలు కుడికాలు చర్మం ఊడిపోయి ఎముకులు కనిపిస్తున్నాయని, ఎత్తు సుమారు 4.5 నుంచి 4.6 ఉంటుందని వెల్లడించారు.
నలుపు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఉందని, సుమారు 15 రోజుల కిందటే చంపి పూడ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహం పూర్తిగా చెడిపోయి ఉండటంతో పోలీసులు, వైద్యులు ఇబ్బందులకు గురయ్యారు.
కాగా, అదే గోతిలో పోలీసులకు ఒక సెల్ఫోన్, మృతురాలి పర్సు దొరికాయని, పర్సులో కొంత నగదు, ఇద్దరి ఫొటోలు లభించాయని చెప్పారు. ఆ ఫొటోలు మృతిరాలి బంధువులుగా భావిస్తున్నామని సీఐ వివరించారు. నడిపూడి పరిసర ప్రాంతాలకు చెందిన యువతి అయి ఉండవచ్చని, పలు కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.