కాల్మనీపై డొక్కా: టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడి అరెస్టు
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం, కాల్మనీ వ్యవహారంలో ఎంతటి స్థాయి వ్యక్తులున్నా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాల్మనీ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెద్దవద్దన్నారు. ఈ కాల్మనీ వ్యవహారం రాష్ట్రంలో ఎప్పటినుంచో సాగుతోందని చెప్పిన ఆయన సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు రాజకీయాలకు అతీతంగా పార్టీలు కలసిరావాలని విజ్ఞప్తి చేశారు.
కల్తీ మద్యం ఘటనపై సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలంటూ డిమాండ్ చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదని ఆయన పేర్కొన్నారు. సంపూర్ణ మద్య నిషేధం అంటే మద్యం మాఫియాను ప్రోత్సహించడమేనని ఆయన తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడి అరెస్టు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. కాల్మనీ ఆరోపణలపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావు, సముద్రాల నాగేశ్వరరావు, లంకలపల్లి సతీష్లను విజయవాడ వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాల్మనీ వ్యవహారంలో విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం కాల్మనీ వ్యాపారుల ఇళ్లలో టాస్క్ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయవాడ వ్యాప్తంగా 92 మంది ఇళ్లలో పోలీసులు సోదాలను నిర్వహించారు.
ఈ సాదాల్లో భాగంగా 52 మంది కాల్మనీ వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు 938 ప్రామిసరీ నోట్లను, 193 బ్లాంక్ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ. 14.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.