అవమానిస్తారా? చర్యలు తప్పవు: పవన్కు డొక్కా హెచ్చరిక, జగన్పైనా ఆగ్రహం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అడ్డదారిలో ఎన్నికయ్యారంటూ ఎమ్మెల్సీలను పవన్ కళ్యాణ్ గేలి చేయడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంతోపాటు ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి విస్మరించిన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా.. రేయింబవళ్లు రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై జగన్, పవన్, ఐవైఆర్, రమణదీక్షితులు విమర్శలు చేయడం సరికాదని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.
బీజేపీ పంజరంలో చిలకలు..
అమరావతిలోని ఏపీ సచివాలయంలో నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్, పవన్, ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, రమణదీక్షితులు.. బీజేపీ పంజరంలో చిక్కుకున్న రామచిలుకలని, వారంతా ఆ పార్టీ పలుకులే పలుకుతున్నారని డొక్కా ఆరోపించారు.
Recommended Video
ఐవైఆర్ వారిని అవమానిస్తున్నారు..
మేధావిగా చెప్పుకుంటున్న ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్రమంతటా తిరుగుతూ.. రాజధాని నిర్మాణానికి 34వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాన్ని అవమానిస్తూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సీఎస్గా ఉన్నప్పుడు ఆయనకు ఇవేవీ తప్పులుగా కనిపించలేదా? అని డొక్కా ప్రశ్నించారు. జగన్, అమిత్ షాలను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని రమణదీక్షితులను నిలదీశారు.
పవన్కు డొక్కా హెచ్చరిక
రాజ్యాంగంలో ఎమ్మెల్సీలు భాగమని, అలాంటి తమను అగౌరవపరుస్తూ మాట్లాడితే శాసనమండలి ప్రివిలైజేషన్ మోషన్ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పవన్ను డొక్కా మాణిక్యవరప్రసాద్ హెచ్చరించారు. పవన్ సోదరుడు చిరంజీవి కూడా పార్లమెంటులో ఎగువసభ అయిన రాజ్యసభ నుంచే ఎన్నికై కేంద్రమంత్రి పదవి చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మోడీ చేతిలో కీలుబొమ్మలయ్యారు
విశాఖకు రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీపై మాట తప్పిన కేంద్రాన్ని ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని డొక్కా మాణిక్యవరప్రసాద్ నిలదీశారు. 5కోట్ల మంది ఆంధ్రుల ప్రయోజనాల కంటే బీజేపీ ప్రయోజనాలే జగన్, పవన్, ఐవైఆర్ కృష్ణారావు, రమణదీక్షితులకు ముఖ్యంగా మారాయని అన్నారు. వాళ్లంతా నరేంద్ర మోడీ చేతిలో కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు.
లోకేష్ పోటీపై తుది నిర్ణయం..
ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబుతో కలిసి పోరాడాలని, లేకుంటే ప్రజలు తిరస్కరిస్తారని జగన్, పవన్లకు డొక్కా సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మంత్రి లోకేష్.. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ రహదారుల సౌకర్యం కల్పించారన్నారు. ఇందుకు లోకేష్ను పవన్ అభినందించాల్సింది పోయి.. విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ పాల్గొనడంపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.