అసలు 'విభజన' ఎక్కడుంది?: కేసీఆర్-కవితలకు డొక్కా కొత్త ట్విస్ట్
హైదరాబాద్: హైకోర్టు విభజన, జడ్జిల ఆప్షన్ విధానం పైన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణకు కొత్త హైకోర్టు కావాలని, ఏపీకి హైకోర్టు కోసం తాము భవనం ఇచ్చేందుకు సిద్ధమన్న కేసీఆర్, కవిత, తెరాస నేతలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
ఏపీ పునర్విభజన చట్టంలో అసలు హైకోర్టును విభజించాలన్న అంశమే లేదని సరికొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. విభజన చట్టంలో హైకోర్టును విభజించాలన్న అంశం ఎక్కడుందో చెప్పాలని ఆయన తెరాస నేతలను సూటిగా ప్రశ్నించారు.
హైకోర్టు ఉమ్మడిగానే ఉండాలని కూడా విభజన చట్టం చెబుతోందన్నారు. హైకోర్టు విభజన కోసమంటూ కీలక బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తులు విధులకు డుమ్మా కొట్టి ఆందోళనల్లో పాలుపంచుకోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ - తెలంగాణ మధ్య మరో వివాదం
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం చెలరేగింది. హైదరాబాదులోని ప్రభుత్వ క్వార్టర్లో ఉంటున్న ఏపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ తక్షణమే దానిని ఖాళీ చేయాలని తెలంగాణ సర్కారు నాలుగు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఏపీ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా తెలంగాణ సర్కారు వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఏపీ నిర్ణయించింది. తెలంగాణ సర్కారు నోటీసులు విభజన చట్టానికి విరుద్ధమని పేర్కొన్న ఏపీ, సదరు నోటీసును తీవ్రంగా పరిగణించింది. గతంలోనూ ఈ తరహాలోనే తెలంగాణ సర్కారు నోటీసులు జారీ చేసిందని ఆరోపిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది.