పరిటాల ఇంటికి వెళ్తే తప్పేంటి, పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు: డొక్కా, బీజేపీపై..
గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పరిటాల సునీత ఇంటికి వెళ్తే తప్పేమిటని టిడిపి నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మంగళవారం ప్రశ్నించారు. అది మంచి సంప్రదాయమని చెప్పారు.
25 మంది కీలక నేతలతో భేటీ, త్వరలో పూర్తి వివరాలు: త్వరలో పవన్ సంచలన ప్రకటన?
Recommended Video
డొక్కా గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. గతంలో పరిటాల కుటుంబంతో జనసేనానికి విభేదాలు ఉన్నట్లు వచ్చిన అనేక ఆరోపణలకు ఈ భేటీ ద్వారా పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారని చెప్పారు. ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సహచర ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణిస్తే కనీసం సంతాప సభకు కూడా రాలేదన్నారు.
ఇది చాలా దారుణం
తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దళిత తేజం కార్యక్రమాన్ని విమర్శించడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని డొక్కా అన్నారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా దళితుల అభ్యున్నతికి సలహాలు ఇవ్వడం మానేసి అసత్య ప్రచారం, ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇది దారుణమైన విషయమని చెప్పారు.
బీజేపీ పెద్దలు స్పందించాలి
ప్రతిపక్షం వినలేని, చూడలేని, కనలేని పరిస్థితిలో ఉందని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎద్దేవా చేశారు. అదేవిధంగా బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పైనా స్పందించారు. వారి మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వాటిపై ఆ పార్టీ అధిష్టానం స్పందించాలని డిమాండ్ చేశారు. టిడిపి మిత్రధర్మానికి కట్టుబడి ఉందని చెప్పారు.
టీడీపీ నేతలతో పవన్ భేటీలు
కాగా, పవన్ కళ్యాణ్ తన అనంతపురం జిల్లా పర్యటనలో పలువురు నేతలను కలిశారు. ఆదివారం పరిటాల సునీత ఇంటికి వెళ్లి, అల్పాహారం తీసుకున్నారు. అంతకుముందు రోజు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కలిశారు. ఆదివారమే మరో ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషాను కూడా కలిశారు.
2019లోను టీడీపీతోనే
2019 ఎన్నికల్లోను పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి ఉంటారని చాలామంది భావిస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే అదే అర్థమవుతోందని చెబుతున్నారు. పైగా తన పర్యటనలో టీడీపీ నేతలతో భేటీ కావడం కూడా ఈ ప్రచారానికి ఊతమిస్తోందని అంటున్నారు.