బిజెపి కూడా, రూ.5 లక్షలిచ్చాం: డొక్కా, వర్సిటీకి జగన్.. దావోస్ నుంచి బాబు సూచన!
గుంటూరు: బిజెపి సహా ఎవరు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ కుటుంబాన్ని పట్టించుకోలేదని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు గురువారం నాడు ఆరోపించారు.
తమ పార్టీ రోహిత్ కుటుంబానికి వెంటనే రూ.5 లక్షలు ఇచ్చిందని చెప్పారు. అలాగే ఉద్యోగం చూపిస్తామని హామీ ఇచ్చిందన్నారు. రోహిత్ వేములకు ముందు తొమ్మిది మంది వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నారని డొక్కా ఆవేదన వ్యక్తం చేశారు.
రోహిత్ మృతికి కారకులైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డొక్కా డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలతో మాట్లాడి విశ్వవిద్యాలయంలో సామరస్య వాతావరణం కోసం ప్రయత్నాలు చేయాలని డొక్కా విజ్ఞప్తి చేశారు.
జగన్, చంద్రబాబు స్పందనలపై చర్చ
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ వెంటనే రోహిత్ తల్లికి ఫోన్ చేసి పరామర్శించారు. విశ్వవిద్యాలయానికి వెళ్లి విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఘటన తెలంగాణలో జరిగినప్పటికీ.. విద్యార్థిది గుంటూరు జిల్లా గురజాడ నియోజకవర్గం.
ఆ తర్వాత వెంటనే చంద్రబాబు కూడా స్పందించారు. టిడిపి తరఫున మంత్రి రావెల కిషోర్ బాబు... రోహిత్ కుటుంబాన్ని పరామర్శించారు. రోహిత్ తల్లికి, తమ్ముడుకి ఒప్పంద పద్ధతిలో ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా చంద్రబాబు దావోస్ నుంచి చేసిన సూచన ఫలితమేననే వాదనలు వినిపిస్తున్నాయి.