మండలిపై వైసీపీ జెండా- భవిష్యత్ సంకేతంగా డొక్కా ఏకగ్రీవం- ఆచితూచి అడుగేస్తున్న ఛైర్మన్...
ఏపీలో మూడు రాజధానుల బిల్లులను అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా సెలక్ట్ కమిటీకి పంపిందన్న కారణంతో శాసనమండలి రద్దుకు సిద్దమైన వైసీపీ సర్కారు... ఇప్పుడు ఆ ప్రతిపాదనపై వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నిలబెట్టాలన్న నిర్ణయంతోనే మండలిపై తాము వెనక్కి తగ్గినట్లు సంకేతాలు పంపిన వైసీపీ... ఇప్పుడు అధికారికంగానే మండలి రద్దు ప్రతిపాదనను ఉపసంహరించుకునేందుకు పావులు కదుపుతోంది.
ఏపీ శాసనమండలి నిరవధికంగా వాయిదా, ఆమోదం పొందని ద్రవ్య వినిమయ బిల్లు, సభలో గొడవ..
మండలి రాజకీయాల్లో మరో ట్విస్ట్...
ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని బిల్లులను ఆమోదించకుండా, తిరస్కరించకుండా ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపింది. దీంతో వైసీపీ సర్కారు ఇగో దెబ్బతింది. అంతే ఇక మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపేశారు. అయితే అనుకున్నదొకటి, అయినదొకటి అన్న తరహాలో మండలి రద్దు ప్రతిపాదనపై కేంద్రం ఇప్పటివరకూ స్పందించలేదు. కరోనా కారణంగా పార్లమెంటు సమావేశాలు వాయిదా పడటం కూడా ఇందుకు ఓ కారణం. ఏదేమైనా ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయాలతో మండలి రద్దుపై ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన పరిస్ధితి.
డొక్కా ఎన్నిక సంకేతాలు...
టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ ఎమ్మెల్సీగా పోటీ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక మండలిపై ప్రభుత్వ తాజా ఆలోచనలకు అద్దం పట్టేలా ఉంది. డొక్కాకు పోటీగా నామినేషన్లేవీ ఫైల్ కాకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. అయితే మండలి రద్దుకు ఆరునెలల క్రితమే కేంద్రానికి ప్రతిపాదన పంపిన వైసీపీ.. డొక్కాను పోటీలో నిలపడం ద్వారా మండలి రద్దుపై వెనక్కి తగ్గినట్లు సంకేతాలు పంపింది. ఇప్పుడు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత వైసీపీ స్పందనను బట్టి మండలిపై ప్రభుత్వం, వైసీపీ అభిప్రాయం మారిందా లేదా అనే అంశంపై స్పష్టత రానుంది.
అనర్హతలపై ఛైర్మన్ ఆచితూచి....
మండలి రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా మార్పులతో గతంలో ప్రభుత్వం విషయంలో కాస్త కరకుగానే వ్యవహరించిన ఛైర్మన్ షరీఫ్ తాజాగా ఆచితూచి అడుగులేస్తున్నారు. మండలిలో బిల్లులపై ఓటింగ్ సందర్బంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డిపై అనర్హత వేటు విషయంలో ఛైర్మన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మండలిలో వైసీపీ బలం పెరిగే అవకాశం ఉండటం, ఆ తర్వాత తన పదవి మార్పు ఖాయమని భావిస్తున్న ఛైర్మన్.. అనర్హతలపై సాగదీత ధోరణినే అనుసరించే అవకాశం ఉంది. దీంతో టీడీపీ కూడా అనర్హతలపై త్వరగా తేల్చాలని ఛైర్మన్ పై ఒత్తిడి పెంచుతోంది.
Recommended Video
ప్రతిపాదన ఉపసంహరణ...
మండలి రద్దుపై మారుతున్న పరిస్ధితుల్లో తమ నిర్ణయాన్ని మార్చుకునేందుకు సిద్ధమవుతున్న వైసీపీ ఈ మేరకు కేంద్రం వద్ద తాము గతంలో పంపిన ప్రతిపాదనను వెనక్కి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డొక్కా ఎన్నిక తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు లేదా మూడు ఎమ్మెల్సీ స్ధానాలను వైసీపీ గెల్చుకునే అవకాశముంది. వచ్చే ఏడాది మార్చి నుంచి టీడీపీ బలం తగ్గుతూ వైసీపీ బలం పెరుగుతుంది. అంటే మరో ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మండలిపై వైసీపీ జెండా ఎగరడం ఖాయం. ఆ లోపు మండలి రద్దయితే ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఈ ప్రతిపాదన ఉపసంహరించుకునేలా కేంద్రంతో లాబీయింగ్ చేసే అవకాశాలున్నాయి.