ఏపీలో పున:ప్రాంభమైన దేశీయ విమాన సర్వీసులు..
దేశవ్యాప్తంగా సోమవారం(మే 25) నుంచి దేశీయ విమాన సర్వీసులు పునరుద్దరించబడగా.. ఆంధ్రప్రదేశ్లో మంగళవారం నుంచి విమాన సర్వీసులు పునరుద్దరించబడ్డాయి. గన్నవరం,విశాఖపట్నం విమానాశ్రయల నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. గన్నవరం నుంచి బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలకు, విశాఖ నుంచి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్లకు విమాన సర్వీసులు నడవనున్నాయి
Recommended Video
తొలిరోజే భారీగా ఫ్లైట్ సర్వీసులు రద్దు.. ఎయిర్పోర్టుల్లో గందరగోళం..
గన్నవరంకు తొలి విమానం బెంగళూరు నుంచి చేరుకున్నట్టు సమాచారం. అటు విశాఖకు మొదట బెంగళూరు నుంచి ఇండిగో విమానం చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో 114 మంది విశాఖకు వచ్చినట్టు సమాచారం.ప్రయాణికులు రెండు గంటలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్రావు చెప్పారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్,శానిటైజేషన్ తర్వాతే విమానంలోకి అనుమతిస్తున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. విమానాశ్రయ సిబ్బంది కూడా రక్షణ దుస్తులు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రయాణికులు విమానాశ్రయంలో దిగాక... ఆర్టీసీ బస్సుల్లో వారిని ప్రత్యేక కేంద్రాలకు తీసుకెళ్లి కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అక్కడ స్వాబ్ శాంపిల్స్ సేకరించిన తర్వాత హోం క్వారెంటైన్కు తరలిస్తున్నారు.
కాగా,విమానంలో ఏపీకి రావాలనుకునేవారు ప్రత్యేక మార్గదర్శకాలను పాటించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రయాణికులు ముందుగా స్పందన వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాతే ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పందన అనుమతి లేని ప్రయాణికులకు నేరుగా టికెట్ల విక్రయాలు జరపవద్దని విమానాయన సంస్థలకు ప్రభుత్వం సూచించింది.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న చెన్నై, ముంబై, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులను నేరుగా క్వారంటైన్కు తరలిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికి కరోనా పరీక్షల తర్వాత 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.