టీకి అవమానం, పీవీ పేరు..: ఎన్టీఆర్ టెర్మినల్పై భగ్గు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఉంచి, డొమెస్టిక్ విమానాశ్రయానికి మాత్రం ఎన్టీఆర్ పేరును ఖరారు ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీని పైన తెరాస, కాంగ్రెస్ పార్టీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.
ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ తప్పుపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఇలా చేయటం సరికాదని అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తమకు అభ్యంతరం లేదని, అయితే, రాజీవ్గాంధీ పేరును ముక్కలు చేయటమే తప్పన్నారు.
విమానాశ్రయానికి రన్వే, బిల్డింగ్ ఒక్కటేనని అలాంటప్పుడు పేర్లు మాత్రం రెండు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. దేశంలో నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీల పేర్లను మాయం చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. ఆంధ్రాలో కూడా విమానాశ్రయాలు ఉన్నాయని, మరిన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు.
వాటికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాల్సిందని అన్నారు. ఇప్పుడు పేరు మార్చడంతో తప్పుడు సంకేతాలు వెళతాయని, దీనిపై పార్లమెంటులో నిలదీస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని విమానాశ్రయానికి పెట్టాలనుకుంటే పీవీ నరసింహా రావు పేరు పెడితే బాగుంటుందని చెబుతున్నారు.
ఎన్టీఆర్ టెర్మినల్ పేరు పెట్టడం తెలంగాణకు, రాజీవ్ గాంధీకి అవమానమని వి హనుమంత రావు అన్నారు. పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి.. ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయటం పట్ల ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించి తెలుగు ప్రజలు గర్వించేలా చేశారని కొనియాడారు.
కేంద్రం నిర్ణయం పట్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టెర్నినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం పైన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఇది సంతోషించదగ్గ విషయమన్నారు.
విమానాశ్రయ అధికారులు తర్జన భర్జన
ఈ ఇంటిగ్రేటెడ్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా టెర్మినల్లేదని, అందువల్ల ఇప్పుడు కేంద్రం ఆదేశాలు ఎలా జారీ చేయాలో తెలియక అధికారులు తర్జన భర్జన పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.