కరోనా: దళారులను నమ్మొద్దు, ఆక్వా రైతులకు మంత్రి మోపిదేవి సూచన, ఉత్పత్తి దెబ్బతినకుండా..
ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆక్వా రంగాన్ని ఆదుకొంటామని ఏపీ సర్కార్ మరోసారి స్పష్టంచేసింది. రొయ్యల రైతులు దళారుల మాటలను నమ్మొద్దని సూచించింది. ఆక్వా ఉత్పత్తులు దెబ్బతినకుండా ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.
ప్రతీ ఒక్క ఆక్వా రైతుకు మద్దతు ధర ఇస్తామని మంత్రి స్పష్టంచేశారు. రైతుల సమస్యలపై సీఎం జగన్ ఫోకస్ చేశారని తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్కు కూలీలు దొరకడం లేదని వివరించారు. వ్యవసాయ, ఆక్వా రంగాన్ని మినహాయించి లాక్ డౌన్ కొనసాగుతదని చెప్పారు. వదంతులను ఆక్వా రైతులు నమ్మొద్దని... సందేహాలుంటే అధికారులను సంప్రదించాలని కోరారు.
ఆక్వా రైతులు దళారుల మాట వినొద్దని సూచించారు. వారి మాట నమ్మి రొయ్యలను అమ్మకానికి పెట్టొద్దనన్నారు. ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రొయ్యల విక్రయానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులను సంప్రదించాలని.. తొందరగా నిర్ణయం తీసుకొవద్దని సూచించారు.
ఇటు ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 161 మందికి వైరస్ సోకిందని అధికరారులు పేర్కొన్నారు. ఇందులో ఢిల్లీ వెళ్లొచ్చిన వారే 140 మంది ఉన్నారు. 21 మంది మాత్రమే విదేశాల నుంచి వచ్చిన వారు, కుటుంబసభ్యుల ద్వారా వైరస్ సోకింది. ఢిల్లీ నుంచి 1085 మంది రాగా.. 885 మందిని గుర్తించామని ఏపీ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. వారు కాంటాక్ట్ అయినవారిలో 32 మందికి వైరస్ సోకిందని చెప్పారు. విశాఖలో మరో ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని.. ప్రైవేట్ ల్యాబ్స్కు కూడా పరిశీలించాలని సీఎం జగన్ కోరారని వివరించారు.