అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలిగిస్తే..: స్పీకర్ తమ్మినేని హెచ్చరికలు
విజయవాడ: తెలుగుదేశం నేతల తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా మండిపడ్డారు. చట్ట సభలకు హాజరుకాకుండా నిరోధించడమంటే సభా హక్కులను హరించడమేనని ఆయన అన్నారు. శాసనసభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేస్తుందని వ్యాఖ్యానించారు.
సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పిన స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదివారం మీడియాతో ఈ మేరకు స్పందించారు. చట్టానికి లోబడే ఎవరైనా నిరసనలు చేయవచ్చని అన్నారు. సభ్యుల సమస్యలు సభలో చెప్పుకోవచ్చని, అంతే కాని దాడులు చేస్తాం.. ముట్టడిస్తామనేది సరైన పద్ధతి కాదని స్పీకర్ అన్నారు.
సభకు సభ్యులు రాకుండా అడ్డుకోవడం కూడా నేరమేనని.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే హక్కు సభకు ఉందని స్పీకర్ సీతారాం హెచ్చరించారు. సభ్యుల హక్కులను కాపాడాల్సిన అవసరాన్ని రాజ్యాంగం కల్పించిందని చెప్పారు.
రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించుకుని పరిష్కరించుకోవాలని ఆయన సూచింారు. సోమవారం నుంచి శాసనసభలు సజావుగా జరిగేందుకు సభ్యులందరూ సహకరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. అసెంబ్లీని ముట్టడిస్తామంటూ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో స్పీకర్ ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం.
జేసీ సోదరులకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్
టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ జేసీ సోదరులని విమర్శించారు. జేసీ బ్రదర్స్ ఓటమి తర్వాత తాడిపత్రిలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందని అన్నారు.
పెద్దారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో మట్కా నిర్వహించేది జేసీ సోదరులేనని ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధం అని పెద్దారెడ్డి జేసీ సోదరులకు సవాల్ విసిరారు. ఆలయాలకు వచ్చే విరాళాలు కూడా జేసీ సోదరులు మింగేశారని ఆరోపించారు. రూ. వందల కోట్లు ఎలా సంపాదించారో జేసీ చెప్పాలన్నారు. జేసీ సోదరులు గ్రామాల్లోని శాంతియువత వాతావరణాన్ని చెడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు.