బైబై బాబు...బైబై పప్పూ: ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న షర్మిల
మంగళగిరి: అన్నం పెట్టే రైతన్న అప్పులపాలు కావొద్దని ఉచిత కరెంటు, ఇన్పుట్ సబ్సీడీలు, బీమా సౌకర్యం కల్పించి వ్యవసాయాన్ని పండగలా చేసినవాడు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అని అన్నారు వైయస్ షర్మిల. మంగళగిరిలో ప్రచారం నిర్వహించిన ఆమె నాటి వైయస్ సంక్షేమ ఫథకాలను ముందుగా గుర్తుచేశారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎలాంటి ధరలు పెంచలేదని ఆమె గుర్తు చేశారు. ప్రతి వర్గానికి మేలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారని చెప్పిన షర్మిల... ఆయన మరణించి పదేళ్లు కావొస్తున్నప్పటికీ కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారని అన్నారు.
లోకేష్కు ఏం అర్హత ఉందని మంత్రి పదవి కట్టబెట్టారు..?
2014లో రైతు రుణమాఫీలు పూర్తిగా చేస్తామని అధికారంలోకి వస్తే తన తొలిసంతకం రుణమాఫీ ఫైలుమీదే ఉంటుందని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాడని ఆ తొలి హామీకే దిక్కులేదని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు షర్మిల. కొత్తగా పసుపు కుంకుమ పేరుతో మహిళలను మళ్లీ మోసం చేసేందుకు సిద్దమయ్యారని అన్నారు షర్మిల. ఆరోగ్యశ్రీలో పలు హాస్పిటళ్లను లిస్టు నుంచి తీసేశారని చెప్పిన షర్మిల... తన కుటుంబానికి జబ్బు చేస్తే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటారని అదే పేదవాడికి జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్లాలని ఆమె ప్రశ్నించారు. ఇక అధికారంలోకి రాగానే రైతుల భూములు లాక్కొన్నారని ఆమె దుయ్యబట్టారు. బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారం చేశారని అయితే... తన కుమారుడు లోకేష్కు మాత్రమే ఉద్యోగం వచ్చిందన్నారు. జయంతికి వర్ధంతికి తేడా తెలియదంటూ విమర్శించారు షర్మిలా. లోకేష్కు ఏం అనుభవం ఉందని మూడు పోర్ట్ఫోలియోలు కట్టబెట్టారని చంద్రబాబును ప్రశ్నించారు. లోకేష్ను పప్పు అని సంబోధించారు షర్మిలా. "పప్పుగారికి పలు అవార్డులు వచ్చాయని టీడీపీ నేతలు గొప్పలు పోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకుకు ఐటీ మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి తనకు కూడా కావాలని కోరడంతో పప్పుకు చంద్రబాబు ఐటీ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ఇప్పటి వరకు ఏ కంపెనీ ఏపీకి తీసుకొచ్చారు" అని ప్రశ్నించారు.
చంద్రబాబు నిజం చెబితే తల వేయి ముక్కలవుతుంది
"గత ఎన్నికల్లో హోదా అన్నారు... ఆ తర్వాత ప్యాకేజీ అన్నారు.. మళ్లీ ఇప్పుడు హోదా అంటున్నారు. చంద్రబాబుది రోజుకో మాట పూటకో వేషం. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతోంది. జగన్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశారు, ప్రతి జిల్లాలో యువభేరీ నిర్వహించారు. ధర్నాలు చేశారు... పార్లమెంటులో కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఆ తర్వాత రాజీనామా చేశారు. జగన్ ఇంత కష్టపడకపోతే చంద్రబాబు నోటి వెంట హోదా అనే మాట వచ్చేదా... చంద్రబాబు నిజం చెప్పాలి. అయితే చంద్రబాబుకు నిజం చెప్పడం చేతకాదు." అని అన్నారు షర్మిల.చంద్రబాబు ఏరోజైతే నిజం చెబుతారో ఆరోజు చంద్రబాబు తల వేయి ముక్కలు అవుతుంది కాబట్టి బాబు నిజం చెప్పరని తన తండ్రి వైయస్ చెప్పేవారని షర్మిల గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను వెబ్సైట్లో పెట్టే దమ్ము చంద్రబాబుకు లేదని ఆమె విమర్శించారు. గత ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఓటుకు నోటు ఇస్తూ దొరికిపోయిన చంద్రబాబు... హైదరాబాదులో ఉంటే కేసులు పెడతారేమోనని విజయవాడకు పారిపోయి వచ్చారని అన్నారు. చంద్రబాబు కేసుల కోసమే హైదరాబాదు వీడి విజయవాడ వచ్చారని ఆమె అన్నారు. చంద్రబాబు హరికృష్ణ మృతదేహం ముందు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటామని చెప్పారని... ఇప్పుడేమో వైసీపీ పొత్తు పెట్టుకుంటోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని షర్మిలా ధ్వజమెత్తారు.
సింహం సింగిల్గా వస్తుంది...
సింహం సింగిల్గా వస్తుందని చెప్పిన షర్మిలా వైసీపీ సింగిల్గా వచ్చినా బంపర్ మెజార్టీతో గెలుస్తుందని దేశంలో అన్ని సర్వేలు చెబుతున్నాయని అన్నారు.తమకు ఎవరితోను పొత్తు పెట్టుకునే అవసరం దాపురించలేదని అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పార్టీని కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానించిన వాడు చంద్రబాబు అని ఆమె ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికలు రావడంతోనే నిరుద్యోగ భృతి, పసుపు కుంకుమ అని చెబుతున్నారని ఆమె విమర్శించారు. ప్రజలు మోసపోవద్దని ఆమె పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు... ఎన్నికల్లోపు తమ అప్పులను తీర్చమని చంద్రబాబును అడగాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారని ఆ ఫోన్లను ఇమ్మని అడగాలని షర్మిల చెప్పారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఓటును డబ్బుతో కొనాలని చూస్తున్నారని... ఎంత డబ్బు ఇచ్చిన ప్రజల బాకీ తీరదని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని తమ హక్కుగా అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు షర్మిల.
జగన్కు ఒక్క అవకాశం ఇవ్వండి
పొరపాటున కూడా ప్రజలు తమ భవిష్యత్తును చంద్రబాబు చేతిలో పెడితే నాశనమే అన్నారు షర్మిలా. జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేశారని చెప్పిన షర్మిల జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను ఆమె అభ్యర్థించారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన కావాలంటే జగన్ రావాలన్నారు షర్మిలా. వెన్నుపోటు బాబు పోవాలంటే జగన్ రావాలని చెప్పిన షర్మిలా వ్యవసాయం మళ్లీ పండగలా మారాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల్లో చేనేతలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని అయితే అది నేరవేర్చలేదని ఆమె ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. నేతన్నల కుటుంబంలో ఇద్దరికి రూ.2వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. చివరిగా బైబై బాబు, బైబై పప్పు అని చెప్పి కార్యకర్తల్లో అభిమానుల్లో జోష్ నింపారు షర్మిల. మంగళగిరిలో ఏరోజు కనిపించని లోకేష్ ఎన్నికల వేళ తెగ తిరిగేస్తున్నాడని విమర్శలు గుప్పించారు షర్మిలా.