షాకింగ్: పవన్ సభకు వెళ్తే రూ.50వేలు జరిమానా!, రాత్రి జనసేనానిపై దాడి యత్నమంటూ...
ఏలూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా కొల్లేరు లంకవాసులతో ఆయన సమావేశమయ్యారు. అయితే అంతకుముందు జనసేనాని సభకు హాజరు కావొద్దంటూ చాటింపు వేయించడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ సభకు లంకవాసులు హాజరు కావొద్దని దండోరా వేయించారు. ఒకవేళ ఆయన సభకు హాజరైతే అలాంటి వారికి రూ.50 వేల జరిమానా విధిస్తామని ఆయా గ్రామ పెద్దలు హుకూం జారీ చేయడం గమనార్హం.
సభలో జెండాలు, టవల్స్ విసిరిన అభిమానులు, పవన్ కంటికి మళ్లీ గాయం
జనసేనానిపై దాడికి యత్నమంటూ
'అర్ధరాత్రి పూట చిల్లర రౌడీ అనుచరులు వచ్చి జనసేనాని మీదకి దాడికి ప్రయత్నం చేస్తుంటే చట్టం ఏం చేస్తున్నట్లు? అర్ధరాత్రి పూట ఒక్క కానిస్టేబుల్ కూడా లేకుండా చేసి ప్రభుత్వం మా నాయకుడిని ఏం చేద్దాం అనుకుంటుంది.' అని జనసేన శతఘ్ని ట్విట్టర్లో పోస్ట్ పెట్టగా, జనసేన రీట్వీట్ చేసింది. బైక్ పైన చింతమనేని ప్రభాకర్ ఫోటో పెట్టుకొని వచ్చిన వారు జనసేనానిపై దాడికి యత్నించారని ఆరోపిస్తున్నారు.
అప్పుడు కూడా దాడి ప్రయత్నం
ప్రభుత్వ చీఫ్ విప్ గూండాయిజం చేస్తున్నాడు అంటే ప్రభుత్వం కూడా గూండాయిజం చేస్తున్నట్లేనని జనసేన శతఘ్ని మరో ట్వీట్లో పేర్కొంది. కాగా, అంతకుముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనను చంపేందుకు ప్రయత్నాలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో విశాఖపట్నం పర్యటనలో ఉండగా కూడా పవన్పై దాడి ప్రయత్నం జరిగింది.
తనను చంపేద్దామని ప్లాన్, ఆ ముగ్గురు ఎవరు?
కొందరు తనను వచ్చే ఎన్నికల్లో చంపేద్దామనే ప్రణాళికలు వేసుకుంటున్నారని, ఇదే అంశంపై ఎవరో ముగ్గురు మాట్లాడుకున్న ఆడియోలు తన వద్దకు వచ్చాయని, తనను చంపేస్తే అందుకు కారకులు ప్రతిపక్షమని, అధికార పక్షమని ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటారని, ఆపై జనమూ మరిచిపోతారని వాళ్లనుకున్నారని, వాళ్లెవరో తనకు తెలుసునని, ఇలాంటివన్నీ తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానా అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి వాటికి భయపడనని చెప్పారు. అయితే పవన్ చెప్పిన ఆ ముగ్గురు ఎవరు అనే చర్చ సాగుతోంది.
అలా అయితే జగన్ ముఖ్యమంత్రి కావాలి
కొంతమంది వేలకోట్లు ఉంటే రాజకీయాలు చేయాలనుకుంటున్నారని, అలా అయితే గత ఎన్నికల్లోనే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందని, ముఖేష్ అంబానీ ప్రధాని అవ్వాలని, లేదంటే టాటానో, బిర్లానో ప్రధానిగా కావాల్సి ఉందని, గెలవాలంటే ప్రజాబలం కావాలని, అది తనకు ఉందని పవన్ చెప్పారు.