కేఈ ప్రభాకర్ రాజీనామా తెలియదు, వైసీపీలోకి వెళ్లిన అభ్యంతరం లేదు: కేఈ కృష్ణమూర్తి
కేఈ ప్రభాకర్ రాజీనామా కర్నూలు తెలుగుదేశం పార్టీని ఒక్కసారిగా కుదిపేసింది. జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్కు మంచి పట్టు ఉంది. అయితే టీడీపీకి కేఈ ప్రభాకర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ్ముడి రాజీనామా విషయం తనకు తెలియదని కేఈ కృష్ణమూర్తి స్పష్టంచేశారు. పార్టీ వీడే అంశం గురించి మాట్లాడలేదని చెప్పారు.
ప్రభాకర్ వైసీపీలోకి వెళ్లిన అభ్యంతరం లేదని కేఈ కృష్ణమూర్తి స్పష్టంచేశారు. మొన్నటివరకు వైసీపీ అంటే ఒంటికాలిపై లేచి కృష్ణమూర్తి స్వరం మారడం అనుమానాలకు తావిస్తోంది. నిజంగా తమ్ముడు వెళ్తుంటే.. అలా అంటున్నారా... లేదంటే జగన్పై సాప్ట్ కార్నర్ ఏర్పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. ప్రభాకర్ మాత్రం టీడీపీ హై కమాండ్, మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై నొచ్చుకొని పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. కానీ తమ్ముడి పార్టీ మారే విషయం మాత్రం తనకు తెలియదని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Recommended Video
దీంతోపాటు డోన్ మున్సిపల్ ఎన్నికలపై కూడా కృష్ణమూర్తి స్పందించారు. మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి 32 వార్డులు, చైర్మన్ పదవీ దానం చేస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థులపై వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీకి దిగితే.. వారి అరాచకాలకు హద్దే ఉండదని.. అందుకోసమే వైసీపీ సీట్లను ధారాదత్తం చేస్తున్నామని కామెంట్ చేశారు.