బాబూ! నీ డ్రామాలు ఆపు, అందుకే ఢిల్లీకి వెళ్లావు, పవన్కళ్యాణ్! అది చదవకు: ధర్మాన
అమరావతి: అఖిల పక్షం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా డ్రామాలు ఆపేయాలని వైసీపీ నేత ధర్మాన ప్రసాద రావు శుక్రవారం అన్నారు. తాము ఇప్పటికే రాజీనామా చేశామని, టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుంటే ప్రజలు వారిని దోషులుగా చూస్తారని చెప్పారు.
మిమ్మల్ని నమ్మట్లేదు: జగన్-బాబులపై పవన్, సీపీఎం మధు చొక్కా విప్పడంతో, యాత్రకు ఆంక్షలు
రాజకీయాలు చేసేందుకు, దోబూచులాటకు ఇది సమయం కాదని ధర్మాన ప్రసాద రావు అన్నారు. హోదా కోసం రాజీనామా చేసిన తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రతినిధులు అని చెప్పారు. ఐదుగురు సభ్యులే పార్లమెంటును స్తంభింపచేశారన్నారు. మా పోరాటాన్ని పవన్ కళ్యాణ్ ఎలా జడ్జి చేయగలరని, ఎవరో రాసిచ్చింది చదవడం సరికాదన్నారు. పవన్ టీడీపీతో పాటు వైసీపీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
హోదా సంజీవిని కాదన్నావుగా
ప్రజలు అంతా గమనిస్తున్నారని, ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని ధర్మాన అన్నారు. హోదా సంజీవిని కాదని గతంలో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. హోదా విషయంలో పలుమార్లు యూటర్న్ తీసుకున్నారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు.
జగన్ నాలుగేళ్లుగా పోరాడుతున్నారు
చంద్రబాబు ఇప్పటికైనా తమతో కలిసి రావాలని, ప్రజల పక్షాన నిలబడతామని ధర్మాన పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని జగన్ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు ఎంపీలతో రాజీనామా చేయించామన్నారు.
ఉద్యమాన్ని నీరుగార్చవద్దు
కానీ చంద్రబాబు మాత్రం మొదట ప్రత్యేక హోదా అన్నారని, ఆ తర్వాత హోదా బదులు ప్యాకేజీ అన్నారని ధర్మాన విమర్శించారు. ప్యాకేజీతో హోదాకు మించిన నిధులు రాష్ట్రానికి వస్తాయని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారన్నారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తేనే కేంద్రం దిగి వస్తుందన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబూ! డ్రామాలు ఆపు
నాలుగేళ్లు టీడీపీ, బీజేపీలు అంటకాగాయని ధర్మాన మండిపడ్డారు. వైసీపీ మాత్రం మొదటి నుంచి హోదాకోసం ఉద్యమిస్తోందన్నారు. ఎంపీల రాజీనామాలతో దేశం దృష్టిని ఆకర్షించామని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటామన్నారు. చంద్రబాబూ! ఇకనైనా డ్రామాలు ఆపాలని, అఖిల పక్షం పేరుతో కాలయాపన చేయవద్దన్నారు.