నా మీద దాడి చేస్తే, 65 ఏళ్లు దాటినా వ్యామోహం తగ్గలేదు: బాబుపై పవన్
విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 65 ఏళ్లకు పైగా వయస్సు వచ్చినా డబ్బు, పదవిపై వ్యామోహం తగ్గలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికలు ఏపీకి చాలా కీలకమని చెప్పారు. రాజకీయరంగంలో ఆర్థిక, సామాజిక విప్లవాన్ని జనసేన తీసుకురాబోతోందన్నారు.
Recommended Video
కర్ణాటక కంటే రసవత్తరం: పవన్ 'కింగ్ మేకర్' ఆశలు, అదే జరిగితే చుక్కలే!
చంద్రబాబు, లోకేష్, జగన్లు తమ అనుచరులతో కలిసి రావాలని, తాను ఒక్కడినే వస్తానని, పాలసీ పైన డిబేట్లో కూర్చుందామని సవాల్ చేశారు. అప్పుడు ఎవరికి ఎంత పరిజ్ఞానం ఉందో తెలిపోతుందని సవాల్ విసిరారు. జనసేనకు భావజాలం పుష్కలంగా ఉందని, టీడీపీ, వైసీపీలకు లేదన్నారు. 2019లో జనసేన గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
అందుకే జనసేన స్థాపించా
అన్యాయాలను నిలదీయడానికి తాను జనసేన పార్టీ పెట్టానని పవన్ అన్నారు. విశాఖలో కార్యకర్తలతో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి సమస్యను అర్థం చేసుకుంటానని చెప్పారు. జనసేన మహిళా విభాగం దుర్గా శక్తి కావాలన్నారు. త్వరలో విశాఖలో పార్టీ మహిళా విభాగం ఆత్మీయ సదస్సు నిర్వహిస్తామన్నారు. ఉత్తరాంధ్ర యాత్రలో ప్రజల కష్టాలు, కన్నీళ్ళు చూశానని చెప్పారు. జనసేన మహిళలకు గౌరవం ఇస్తుందన్నారు.
ఇంత పెద్ద పార్టీ ఎలా సాధ్యమని అడిగారు
అడపడుచులు కూడా కవాతులో పాల్గొంటామని చెబితే, ఇబ్బందులు ఉంటాయని వద్దని చెప్పానని పవన్ తెలిపారు. వారి సమస్యలు, బాధలను అర్థం చేసుకోగలనని తెలిపారు. తనను అవమానించినా, హరాస్ చేసినా గుండెల్లోనే పెట్టుకున్నానని, మహిళలకు సంబంధించిన పబ్లిక్ పాలసీ పార్టీ పరంగా రూపొందించేటప్పుడు అక్కాచెల్లెళ్ల సలహాలు తీసుకుంటానని చెప్పారు. 2014లో నేను పార్టీ పెట్టనప్పుడు ఇంతపెద్ద పార్టీ ఎలా సాధ్యమని కొందరు తనను ప్రశ్నించారని చెప్పారు.
బొత్సకు తెరాసతో సంబంధాలు!
అప్పుడు తన వద్ద కొద్దిమందే ఉన్నారని, అయినా ముందుకు సాగానని పవన్ చెప్పారు. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగినప్పుడు చాలామంది నాయకులు పార్టీ తరఫున ఆ స్టాండ్తోనే మాట్లాడారు తప్ప ప్రజల తరఫున మాట్లాడలేదన్నారు. ఎంతసేపు వాళ్ల వ్యాపారాలు పోతాయనే భయమన్నారు. వ్యాపారంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు, తెరాస నేతలకు సంబంధాలు ఉంటాయని, టీడీపీ నేతలకు, వైసీపీ నేతలకు సబంధాలు ఉంటాయని, వారు అంతా ఒకటే అన్నారు. మనకు కావాల్సింది మూడో వ్యక్తి అని, అతను మాట్లాడితే మార్పు వస్తుందన్నారు.
డర్టీ పాలిటిక్స్ అనొద్దు
2050లో విశాఖపట్నం ఎలా ఉండాలో మీరు (చంద్రబాబు, లోకేష్, జగన్) చెబుతారా, నేను చెప్పాలా అని పవన్ ప్రశ్నించారు. విశాఖ ఉక్కుకు 26వేల ఎకరాలు తీసుకొని, మూడు ఎకరాల్లో పెట్టారన్నారు. ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన నిర్వాసితులు కష్టాలు పడుతున్నారన్నారు. రాజకీయాలు చాలా పవిత్రమైనవని, డర్టీ పాలిటిక్స్ అనవద్దన్నారు. గాంధీ, నేతాజీ, జయప్రకాశ్ నారాయణ వంటి మహానుభావులు ఉన్నారన్నారు.
నామీద దాడి చేస్తే బలంగా పోరాడుతా
నా మీద ఎవరైనా దాడి చేస్తే అంతే బలంగా పోరాడుతానని, జీవితకాలంలో ఎంత మార్పు వస్తుందో, అంత మార్పు రావడానికి కృషి చేస్తానని, మీ అందరి కోసం నేను అండగా ఉంటానని పవన్ చెప్పారు. జైళ్లకు వెళ్లిన వాళ్లు, దోపిడీలు చేసిన వారు రోల్ మోడల్స్ కాదన్నారు. గెలుపు, అధికారం పోరాటంలో భాగమన్నారు.