కరోనా కష్టాల్లో ఉన్నాం..పొరపాట్లు జరుగుతున్నాయ్..కానీ రాజకీయం మాట్లాడను.. పరిపక్వత చాటుకున్న పవన్.
హైదరాబాద్/అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పరిపక్వత చూపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటిలాగే విరుచుకుపడే సమయంలో సంయమనం పాటిస్తానని, కరోనా కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో కలిసికట్టుగా ఉండాలని, ప్రభుత్వ పొరపాట్లను ఎత్తిచూపబోనని, కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేసారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుడా ఉండేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఉపాది కోల్పోయిన వారికి, నిరుపేదలకు, రోజువారీ కూలీలకు తీవ్ర నష్టం జరుగుతోందని, అలాంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసారు.
ఏపిలో పెరుగుతున్న పాసిటీవ్ కేసులు..
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాసిటీవ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్వీయ నియంత్రణకు సంబంధించిన ఆంక్షలను వైసిపి ప్రభుత్వం మరింత కఠిన తరం చేసింది. లాక్ డౌన్ మరో నాలుగు రోజుల్లో తొలగిపోనున్న తరుణంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఆంక్షలను మరికొంత కాలం పొడింగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపి ప్రభుత్వం ప్రజలకు తగు సూచనలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలెవ్వరూ ఇళ్లనుండి బయటకు రావొద్దన్న ఆక్షలను మరింత కఠినంగా అమలు చేసేందకు రంగం సిద్దం చేస్తోంది. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది.
ప్రభుత్వ పొరపాట్లు జరుగుతున్నాయి..
లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తున్న ప్రజలపై శిక్షలు తీవ్రతరం చేయాలని పోలీసులు నిర్ణయించారు. అంతే కాకుండా లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, బీయ్యంతో పాటు నిరుపేదలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేయాలని వైసిపి ప్రభుత్వం నిశ్చయించింది. అందులో భాగంగా పేదలందరికి న్యాయం జరగడం లేదనేది జనసేన వాదన. జీవనోపాది కోల్పోయిన అనేక మంది పేద ప్రజలకు ప్రభుత్వ సాయం అందడం లేదని, ప్రభుత్వ క్షేత్ర స్థాయి పర్యవేక్షణ విఫలం అయ్యిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బాదితులు కూడా తమకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ కు విన్నవించుకుంటున్నట్టు సమాచారం.
ఎంతో మంది జీవనోపాది కోల్పోయారు..
కాగా పూర్తి స్థాయిలో సహాయం అందని పేద ప్రజలతో సహకారంతో ప్రభుత్వంపై అనేక విమర్శలు చేయొచ్చని, కాని ప్రస్తుత పరిస్థితుల్లో అలా రాజకీయం చేయడం భావ్యం కాదని జనసేనాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా టెస్టులు నిర్వహించడంలో, ఐసోలేషన్ సౌకర్యం కల్పించడంలో, కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు కల్పించాల్సిన వసతుల అంశాల్లో అనేక లోపాలు జరుగుతున్నాయని జనసేన దృష్టికి వచ్చినట్టు ఆ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏపిలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా పాసిటివ్ కేసులను కట్టడి చేయండంలోనూ ప్రభుత్వం విఫలం చెందిందనేది జనసేన వాదన. కాగా ప్రస్తుత క్లిష్ట సమయంలో ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలకు దిగబోని చెప్పుకొస్తున్నారు జనసైనికులు.
లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు..
అంతే కాకుండా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడం పట్ల ప్రణాళికతో ముందుకు వెళ్తామని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ డిస్టెన్సింగ్, ఇతర నిబంధనలు పాటిస్తూ సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని, జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి పేద కుటుంబాలకు అండగా ఉండాలని ఇచ్చిన పిలుపుకు కట్టుబడి పని చేయాలని సూచించారు పవన్. లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలకు తావు లేకుండా సహాయ కార్యక్రమాల్లో పాల్లొనాలని క్యాడర్ కు దిశానిర్ధేశం చేసిన పవన్ కళ్యాన్ మరోసారి తన రాజకీయ పరిపక్వతను చాటుకున్నట్టు చర్చ జరుగుతోంది.
Recommended Video