'జగన్ రాజీనామా వెనుక... విద్యార్థులారా! ఆయన వలలో చిక్కుకోవద్దు'
విజయవాడ: విద్యార్థులారా! వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వలలో పడవద్దని తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం నాడు సూచించారు. కర్నూలులో జగన్ యువభేరీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి సీనియర్ నేత బోండా ఉమ ఈ రోజు స్పందించారు.
బోండా ఉమ విజయవాడలో మాట్లాడారు. జగన్ పార్టీ ఉనికి కోసమే రాజీనామాలు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీలతో రాజీనామా చేయించడం కాదని, జగన్కు దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. ప్రత్యేక హోదా పైన మాట్లాడే నైతిక హక్కు జగన్కు, వైసిపికి లేదన్నారు.
ప్రత్యేక హోదాకు బదులు భారీ ప్యాకేజీని కేంద్రం ఇస్తోందని చెప్పారు. హోదా వల్ల వచ్చే లాభాలు అన్ని కూడా ప్యాకేజీ వల్ల వస్తున్నాయని చెప్పారు. జగన్కు లక్షల కోట్ల రూపాయల ఎంవోయులు కుదుర్చుకుంటే కనిపించడం లేదా అని నిలదీశారు.
జగన్ వలలో చిక్కుకోవద్దని విద్యార్థులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. కర్నూలులో జరిగిన టీడీపీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ యువభేరిపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని చెబుతూ విద్యార్థులను జగన్ తప్పుదోవపట్టిస్తున్నారన్నారు.
మన రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఏపీకి ప్రత్యేక హోదాపై విద్యార్థులకు తెలియజెప్పేందుకుగాను కర్నూలు జిల్లా గుత్తి రోడ్డులోని వీజేఆర్ ఫంక్షన్ హాలులో జగన్ మంగళవారం యువభేరి నిర్వహించారు.