కేరళకు సాయం చేయండి: జనసేన, బుట్టా రేణుక రూ.5 లక్షల విరాళం
అమరావతి/కర్నూలు: భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన కేరళవాసులను ఆదుకోవాలని జనసేన శ్రేణులకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గందాధరం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ప్రకృతికి మానవడు చేస్తున్న హాని కారణంగా నేడు కేరళ అతలాకుతలం అయిందని ప్యాక్ అభిప్రాయపడింది. ప్యాక్ సమావేశం హైదరాబాద్ మాదాపూర్లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. జనసైనికులు అందరు తమ శక్తికొద్ది కేరళకు సాయం చేయాలని ఈ సందర్భంగా కోరింది.
కొత్త దుస్తులు, ఆహార పదార్థాలు, మందులు వంటి అత్యావసరాలను అందించాలని సూచించింది. జనసైనికులు బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
Recommended Video
అలాగే సెప్టెంబర్ 2వ తేదీన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని జనసైనికులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు తలపెట్టినట్లుగా సమాచారం అందుతోందని, ఈ సేవా కార్యక్రమాలలో కేరళ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లకు సాయపడే అంశాన్ని చేర్చాలని కోరింది.
పవన్ పర్యటన వాయిదా
పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 23వ తేదీ నుంచి తలపెట్టిన జగన్ పర్యటన వాయిదా వేసినట్లు పార్టీ తెలిపింది. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పోలవరం ప్రాంతాలలో ఈ పర్యటన ఉండాల్సి ఉందని, అయితే ఈ జిల్లాల్లో అధిక వర్షపాతం కారణంగా రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడటంతో, చాలా ప్రాంతాలు జలమయం కావడంతో పర్యటన వాయిదా పడినట్లు తెలిపారు. తదుపరి పర్యటన తేదీని త్వరలో ఖరారు చేస్తామన్నారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చాక పర్యటన ఉంటుందన్నారు.
కేరళ వరద బాధితులకు బుట్టా రేణుక రూ.5 లక్షల ఆర్థిక సాయం
కేరళ వరద బాధితులకు పార్లమెంట్ సభ్యుల నిధి నుంచి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కేరళలో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయని, వరద ప్రభావంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించిందన్నారు. ముఖ్యంగా ఎర్నాకులం జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో తన ఎంపీ కోటా నుంచి రూ.5 లక్షల విరాళం పంపించానని చెప్పారు.
ఏపీ ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం
కేరళ వరద బాధితులకు ఏపీ ప్రజాప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు.
తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సాయం
కేరళ వరద బాధితుల సహాయార్ధం ఉద్యోగులు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒకరోజు వేతనం రూ.9 కోట్లను సీఎండీ ప్రభాకర్ నేతృత్వంలో మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
ప్రకృతి బీభత్సంతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అయినందున, దేశం అంతా కేరళకి అండగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.25 కోట్లతో పాటు బియ్యం అందించామన్నారు. వారికి మనోధైర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశంలో ఎవరికి ఇబ్బంది, కష్టాలు వచ్చిన ఆదుకునే వారు ఉన్నారనే ద్యైర్యం వారిలో కల్పించాలన్నారు. కేరళ ప్రజలు వెంట మేము ఉన్నామని వారు భయపడ వద్దన్నారు. కేరళకు విద్యుత్ స్థంబాలు, కరెంటు మీటర్లు, ఇతర విద్యుత్ పరికరాలు కూడా పంపుతున్నామన్నారు.