చిరంజీవి అనే పేరుకి సార్థకత: నాలుగు కుటుంబాల్లో దీపం వెలిగించాడు
హైదరాబాద్: బ్రెయిన్డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవాలు నలుగురి ప్రాణాలను కాపాడాయి. తాను మరణించినా తన అవయవాలు ఇతరులకు ఉపయోగపడాలని ఆ వ్యక్తి దానం చేస్తే, వాటిని అవసరమైన వారికి వైద్యులు అమర్చారు. ఈ మొత్తం ప్రకియలో మేము సైతం అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ వంతు సహకారాన్ని అందించారు.
వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా తిరుపతి వైకుంఠపురం సమీపంలోని గాంధీపురంలో నివాసం ఉంటున్న చిరంజీవిరెడ్డి(45)కి పది రోజుల క్రితం జ్వరం, తలనొప్పి రావడంతో చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అతడి మెదడులో రక్తనాళాలు గడ్డకట్టినట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు.
ఆనంతరం ఆరోగ్యం కుదుటపడ్డాక డిశ్చార్జి చేశారు. ఐదు రోజుల తర్వాత మళ్లీ ఆరోగ్యం క్షీణించి మతి స్థిమితం లేకుండా తిరగడంతో జూలై 27న స్విమ్స్కి తీసుకొచ్చారు. దీంతో ఆర్ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన వైద్యులు శనివారం సాయంత్రం అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు.
ఈ క్రమంలో విషాదంలో మునిగిఉన్నప్పటికీ, చిరంజీవిరెడ్డి అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. స్విమ్స్లో గుండె మార్పిడికి సంబంధించి జీవన్ దాన్ పథకం కింద అనుమతి ఉండటంతో హైదరాబాదులోని స్టార్ ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇచ్చారు.
అక్కడి నుంచి గుండె వైద్య నిపుణులు గోపీచంద్, సత్యనారాయణ, డాక్టర్ లోకేశ్వర్రావు సజ్జా ఆదివారం ఉదయం స్విమ్స్కు చేరుకున్నారు. చిరంజీవిరెడ్డికి శస్త్రచికిత్స చేసి గుండెను వేరు చేశారు. తగిన ఏర్పాట్ల మధ్య ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో రేణిగుంట విమానాశ్రయానికి కారులో గుండెను తీసుకెళ్లారు.
చిరంజీవి అనే పేరుకి సార్థకత: నాలుగు కుటుంబాల్లో దీపం వెలిగించాడు
అక్కడనుంచి నేరుగా విమానంలో హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 20 నిమిషాల వ్యవధిలో గ్రీన్ చానల్ (ట్రాఫిక్ లేకుండా చేసి) సహాయంతో స్టార్ ఆస్పత్రికి చిరంజీవి గుండెను తీసుకొచ్చారు. అప్పటికే ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ గోపీచంద్ మన్నెం మరో ఆరుగురు వైద్య బృందం విజయలక్ష్మికి గుండెను అమర్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
చిరంజీవి అనే పేరుకి సార్థకత: నాలుగు కుటుంబాల్లో దీపం వెలిగించాడు
సరిగ్గా మూడున్నర గంటల ప్రాంతంలో ఆసుపత్రికి చేరిన గుండెను విజయలక్ష్మికి అమర్చే శస్త్రచికిత్స ప్రారంభించారు. ఈ గుండెను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయలక్ష్మి (36) అనే మహిళకు అమర్చారు. పదేండ్లుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉన్న విజయలక్ష్మికి అవయవదానం ద్వారా అరుదైన గుండె మార్పిడి సర్జరీ జరిగి ప్రాణాలు దక్కే అవకాశం రావడంతో కుటుంబసభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలో మానవత్వం ఇంకా మిగిలే ఉందని ఈ ఘటన రుజువు చేసిందని విజయలక్ష్మి తల్లి లక్ష్మి అన్నారు.
చిరంజీవి అనే పేరుకి సార్థకత: నాలుగు కుటుంబాల్లో దీపం వెలిగించాడు
సాధారణ కుటుంబానికి చెందిన తమ కూతురుకు వచ్చిన జబ్బుతో లక్షల రూపాయలు ఖర్చుచేశామని చెప్పారు. ఏ దారీలేని సమయంలో తిరుపతిలో వ్యక్తి నుంచి సేకరించిన గుండెను తమ కూతురుకు అమర్చేందుకు తీసుకురావడంతో నోటమాటరావడం లేదని పేర్కొన్నారు. ఇక చెన్నైలోని ఆపోలో ఆసుపత్రి వైద్యులు స్విమ్స్కు చేరుకుని కాలేయాన్ని ఆపరేషన్ ద్వారా వేరు చేసి మధ్యాహ్నం 2.40 గంటలకు కారులో రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడ నుంచి ఎయిర్ కోస్టా విమానంలో విశాఖపట్నానికి తీసుకెళ్లారు. అక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి కాలేయం అమర్చారు.
చిరంజీవి అనే పేరుకి సార్థకత: నాలుగు కుటుంబాల్లో దీపం వెలిగించాడు
నెల్లూరు నారాయణ ఆస్పత్రి వైద్యులు, స్విమ్స్లోని నెఫ్రాలజీ డాక్టర్ ప్రవీణ్, యూరాలజీ ప్రొఫెసర్ సత్యప్రకాష్ చిరంజీవిరెడ్డి కిడ్నీలను వేరు చేసి.. ఒక కిడ్నీని నెల్లూరులోని నారాయణ ఆస్పత్రిలో రోగికి అమర్చేందుకు తీసుకెళ్లగా, మరో దానిని స్విమ్స్ నెఫ్రాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న మహిళకు అమర్చనున్నట్లు వైద్యులు తెలిపారు.