'నాలా ఇంకెవరూ మోసపోవద్దు.. ఆమె నా మనసుతో ఆడుకుంది'
అనకాపల్లి: ఓ అమ్మాయి తన మనసుతో ఆడుకుందని, అబ్బాయిలంతా అమ్మాయిలను నమ్మి మోసపోవద్దని చెబుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతనో సెల్ఫీ వీడియో రికార్డు చేయడం గమనార్హం. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఎవరితను?
చోడవరానికి చెందిన ఎలిశెట్టి రాజశేఖర్(30)కి నాలుగేళ్ల క్రితం మేనకోడలైన కృపారాణితో వివాహం జరిగింది. తల్లి లక్ష్మి, భార్యతో కలిసి నివాసం ఉంటున్న రాజశేఖర్.. స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
అశ్వినితో రహస్య వివాహం
ఇదే క్రమంలో.. గోవాడ అంభేరుపురానికి చెందిన అశ్వినితో రాజశేఖర్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి ఆమెను రహస్యంగా వివాహం చేసుకునేదాకా వెళ్లింది. అయితే ఇటీవల అశ్విని ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు రాజశేఖర్ గమనించాడు. పదేపదే అశ్వినిని దానిపై నిలదీయడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మనస్తాపంతో ఆత్మహత్య
ఈ నేపథ్యంలో పోలీసులు రాజశేఖర్ తల్లి, భార్యలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. తన వల్ల వాళ్లిద్దరూ పోలీస్ స్టేషన్కు రావాల్సి వచ్చిందని భావించిన రాజశేఖర్.. మనస్తాపంతో శుక్రవారం తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
'మీరూ నాలాగా మోసపోవద్దు'
'ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోని రికార్డు చేశాడు. 'అమ్మా.. కృపారాణీ... నన్ను క్షమించండి. మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను. అశ్విని నమ్మినందుకు నా మనసుతో ఆడుకొని మోసం చేసింది. యువకులంతా అమ్మాయిలను నమ్మి నాలాగా మోసపోవద్దు' అంటూ ఆ వీడియోలో రాజశేఖర్ పేర్కొన్నాడు.