ఏపీ నుంచి ఢిల్లీకి 3 కోట్ల లీటర్ల పాలు- దూద్ దురంతో రైళ్లలో రవాణా- దక్షిణ మధ్య రైల్వే రికార్డు
కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రయాణికుల రైళ్లు నిలిచిపోవడంతో రైల్వేశాఖకు ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించిన రైల్వేశాఖ భారీగా అదాయం తెచ్చిపెట్టే సరకు రవాణాను గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో పెంచింది. అప్పట్లో ప్రయోగాత్మకంగా పాల రవాణా కోసం అత్యంత వేగంగా ప్రయాణించే దూద్ దురంతో రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య పాల రవాణా కూడా సునాయాసంగా సాగుతోంది.
కరోనా సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించిన దూద్ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకూ ఏకంగా 3 కోట్ల లీటర్ల పాలను ఎగుమతి చేసింది. ఏపీలోని రేణిగుంట స్టేషన్ నుంచి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్కు ఇప్పటివరకూ ఈ పాలను ఎగుమతి చేయగలిగినట్లు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ప్రకటించింది. జూలై 15 నుంచి ఏపీ నుంచి దేశ రాజధానికి క్రమం తప్పకుండా ఈ ప్రత్యేక రైళ్లలో పాలను ఎగుమతి చేయడం ద్వారా అక్కడి ప్రజల నిత్యావసరాలను తీర్చారు.
Recommended Video
ఒక్కో ట్యాంకర్లో 40 వేల లీటర్ల పాలతో ఆరు ట్యాంకర్లను ఒక్కో దూద్ దురంతో సర్వీసుగా నడిపారు. ఇలా 126 ట్రిప్స్లో ఒక్కో ట్రిప్కు 2.4 లక్షల లీటర్ల చొప్పున పాలను ఢిల్లీకి రవాణా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చిత్తూరు జిల్లాతో పాటు సమీపంలోని 13 వేల గ్రామాల్లో ఉన్న 3 వేల పాయింట్ల నుంచి పాలను సేకరించి ఇలా ఢిల్లీకి రవాణా చేశారు. ఇవే రైళ్లకు పాలతో పాటు మిగతా పండ్లు, ఇతర నిత్యావసర వస్తువులను సైతం పంపినట్లు అధికారులు తెలిపారు.