కలిసి రాని కాలం- చంద్రబాబు ఆత్మీయుడి ఒంటరిపోరాటం కథ ముగిసినట్లేనా ?
విదేశాలకు నిఘా రహస్యాలను చేరవేయడం, నిఘా పరికరాల అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కష్టకాలం దాపురించినట్లే కనిపిస్తోంది. ఈ కేసులో ఏబీని సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోంశాఖతో పాటు క్యాట్ కూడా సమర్ధించడంతో ఇక ఏబీకి దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న ఏబీపై ఛార్జిషీట్ కూడా దాఖలైతే ఆయన కెరీర్ ఇక ముగినట్లేనని చెప్పవచ్చు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక..
2014లో టీడీపీ అధికారం చేపట్టాక అదనపు డీజీ హోదాలో విజయవాడ పోలీసు కమిషనర్ గా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. కృష్ణాజిల్లాకే చెందిన ఏబీని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏరికోరి ఆ పోస్టులో నియమించింది. దీంతో విజయవాడ నగరంలో టీడీపీ నేతలతో ఆయన సాన్నిహిత్యం పెరిగింది. అప్పుడే అమరావతి రాజధాని కావడం, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చేయడం, ఇదంతా ఇంటిలిజెన్స్ వైఫల్యంగా పరిగణించి అప్పటి ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్న అనురాధపై చంద్రబాబు వేటు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుకు ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా అనతికాలంలోనే బాధ్యతలు చేపట్టారు.
ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా వివాదాలు
ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఛీఫ్ అయ్యాక అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఆయన ఇచ్చే నివేదికపై ఆధారపడటం మొదలుపెట్టింది. దీంతో నిఘా వ్యవస్ధను మరింత పటిష్ట పరిచే క్రమంలో ఏబీ ఇజ్రాయెల్ కు చెందిన ఓ ప్రైవేటు సంస్ద నుంచి అత్యాధునిక నిఘా పరికరాలను తన కుమారుడికి చెందిన సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించి మరీ తెప్పించారు. కొనుగోలుకు అనుసరించిన ప్రక్రియపై ఉన్నతాధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయారు ఏబీ. ఆ తర్వాత సదరు నిఘా పరికరాలతో టీడీపీ మంత్రుల కదలికలపైనా ఏబీ నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ఆయన్ను నిఘా ఛీఫ్ గా కొనసాగించారు.
2019 ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగా..
2019 ఎన్నికల నాటికి చంద్రబాబుకు ఏబీ పూర్తి నమ్మకస్తుడిగా మారిపోయారు. దీంతో చంద్రబాబు ఆయనకు టీడీపీ తరఫున సార్వత్రిక ఎన్నికల అభ్యర్ధులను ఎంపిక చేసే బాధ్యతల్లో అనధికారికంగా వాడుకున్నారు. ఇందులో అప్పటి నిఘా నివేదికల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేసిన ఏబీ.. పలుచోట్ల అభ్యర్ధుల ఎంపికలో వివాదాలు తలెత్తినా వాటిని చొరవతో పరిష్కరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర్రంలో మరోసారి టీడీపీ గెలవబోతోందని ఏబీ ఇచ్చిన నివేదికలు చంద్రబాబులో సంతోషం నింపగా... పార్టీ నేతలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. రాష్ట్రంలో టీడీపీ గెలవబోతోందనని చెప్పిన ఏబీ... విజయవాడ ఎంపీ స్ధానంలో మాత్రం పార్టీ అభ్యర్ధి కేశినేని నాని ఓడిపోతున్నట్లు నివేదిక ఇచ్చారు. దీనిపై ఇప్పటికీ నాని ఆగ్రహంగా ఉన్నారు.
టీడీపీ ఓటమితో కష్టాలు
2019 ఎన్నికల్లో టీడీపీ మరోసారి గెలవబోతోందని ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఏబీ ఇచ్చిన నివేదికలు దారుణంగా విఫలమయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం కావడంతో చంద్రబాబు దగ్గర ఆయన పలుకుబడి సైతం అంతే వేగంగా ఆవిరైపోయింది. దీంతో చంద్రబాబుకు ఆయన దూరమైపోయారు. అదే సమయంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు సహకరించే క్రమంలో తమను టార్గెట్ చేశారనే నెపంతో వైసీపీ నేతలు ఆయనపై పగబట్టారు. దీంతో అటు టీడీపీకీ, వైసీపీకి దూరమైన ఏబీ.. రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయారు.
నిఘా డేటా చౌర్యం కేసు.. సస్పెన్షన్
వైసీపీ అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరావును ఇంటిలిజెన్స్ ఛీఫ్ బాధ్యతల నుంచి తప్పించింది. అంతే కాకుండా 9 నెలల పాటు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా గాల్లోనే ఉంచింది. అప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఆయన కొనుగోలు చేసిన నిఘా పరికరాల వ్యవహారంతో పాటు ఇజ్రాయెల్ కు అధికారిక రహస్యాలు చేరవేశారంటూ పలు కేసులు నమోదు చేసి విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించి స్టే కోరినా ఫలితం లేకపోయింది. ఏబీ సస్పెన్షన్ పై స్టే కు క్యాట్ నిరాకరించగా.. తాజాగా సస్పెన్షన్ ను ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు ఏబీపై నిఘా రహస్యాల చేరవేత కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని కూడా ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఏబీకి ఇప్పుడు అన్ని దారులూ మూసుకుపోయినట్లయింది. న్యాయపోరాటం మినహా ఇప్పుడు ఆయన చేయగలిదిందేమీ లేదు. అదే సమయంలో గతంలో అంతా తానే వ్యవహరించిన టీడీపీ ఏబీని వదిలించుకోగా. వైసీపీ కూడా ఆయన్ను టార్గెట్ చేయడంతో ఇప్పుడు ఆయన పరిస్ధితి దారుణంగా తయారైంది.