అవును..వాళ్లిద్దరు రిలీవ్ అయ్యారు: ప్రయత్నించిన జగన్ దౌత్యం: ఇక..ఏపీలో కీలక పోస్టుల్లో..!
జగన్ అనుకున్న విధంగా ఆ ఇద్దరినీ రిలీవ్ చేయించారు. ఇక ఏపీలో ఆ ఇద్దరికీ పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉంది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఐఏయస్ అధికారి శ్రీలక్ష్మి..ఐపీఎస్ అధికారి స్టెఫెన్ రవీంద్రను తన ప్రభుత్వంలో కీలక పోస్టులు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఇద్దరూ తెలంగాణ ప్రభుత్వంలో ఉండంతో నేరుగా ఏపీ సీఎం తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి వారిని రిలీవ్ చేసేలా ఒప్పించారు. ఇంతలో కేంద్రంలోనీ డీఏపీటీ అడ్డుపుల్ల వేసింది. ఆ వెంటనే మరోసారి జగన్ సూచనల మేరకు రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి నేరుగా ప్రధాని..హోం మంత్రి అమిత్షా వద్దకు వెళ్లి వీరి రిలీవ్ చేయటం గురించి చర్చించారు. ఫలితంగా కేంద్రం వీరిద్దరినీ రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక...ఏపీలో వీరికి నిమాయక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.
శ్రీలక్ష్మిని రిలీవ్కు నిర్ణయం..రేపోమాపో ఉత్తర్వులు..
జగన్ జోక్యంతో ఎట్టకేలకు కేంద్రం అంగీకరించింది. ఐఏయస్ అధికారి శ్రీలక్ష్మిని ఏపీలో పని చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా..కేంద్ర డీఓపీటీ ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీంతో.. శ్రీలక్ష్మి ఏపీ సీఎం సూచనల మేరకు ఎంపీ విజయ సాయిరెడ్డితో కలిసి ప్రధానిని కలిసారు. ఆ తరువాత హోం మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. తనను రిలీవ్ చేస్తే ఏపీలో పని చేసుకొనే అవకాశం కలుగుతుందని వివరించారు. దీంతో..వెంటనే డీఓపీటీ అధికారులకు అందిన ఆదేశాల మేరకు శ్రీలక్ష్మిని రిలీవ్ చేయటానికి రంగం సిద్దమైంది. సాంకేతిక కారణాలను పక్కన పెట్టి శ్రీలక్ష్మిని రిలీవ్ చేస్తూ ఫైల్ సిద్దమైంది. దీని మీద డీఓపీటీ నోట్ కూడా సిద్దం చేసింది .హోం శాఖ కార్యదర్శి ఆమోద మద్ర వేయగానే శ్రీలక్ష్మి ఇక ఏపీలో బాధ్యతలు తీసుకోవటానికి ఎటువంటి అడ్డంకి ఉండదు. దీంతో.. మరో మూడు లేదా నాలుగు రోజుల్లో శ్రీలక్ష్మి ఏపీలో బాధ్యతలు దక్కే అవకాశం కనిపిస్తోంది.
స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్
సీనియర్ ఐపీయస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర రిలీవ్కు సంబంధించి కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. ఏపీలో జగన్ గెలిచిన వెంటనే స్టీఫెన్ వచ్చి ఆయన్ను కలిసారు. ఏపీలో పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అప్ప టికే సీఎం సైతం స్టీఫెన్ గురించి తెలిసి ఉండటంతో కీలక పదవి ఇవ్వాలని భావించారు. దీనికి అనుగుణంగా నేరుగా తెలంగాన ముఖ్యమంత్రితో మాట్లాడి స్టీఫెన్ రవీంద్రను రిలీవ్ చేయాలని కోరారు. ఆయన సైతం అంగీకరించారు. అయితే, స్టీఫెన్ విషయంలో స్టేట్ డిప్యూటేషన్ మార్చేందుకు చెబుతున్న కారణాలతో కేంద్ర డీఏపీటీ సంతృప్తి చెంద క..ఫైల్ను పక్కన పెట్టింది. ఆ విషయం పెండింగ్ లో పడటంతో ఏపీ పోలీసు అధికారులతో టచ్లోనే ఉన్న స్టీఫెన్ విధుల్లో భాగంగా కొన్ని సూచనలు సైతం చేస్తున్నట్లు సమాచారం. తాజాగా వైసీపీ నేతల జోక్యంతో కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారుల సూచనలతో డీఓపీటీ స్టీఫెన్ ను రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో..ఇక ఆయన ఏపీలోని పోలీసు శాఖలో కీలక పోస్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆ ఇద్దరికీ పోస్టులు ఖరారు..
జగన్ పైన అప్పట్లో నమోదు చేసిన కేసుల్లో శ్రీలక్ష్మి కూడా జైలు శిక్ష అనుభవించారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అయ్యే అర్హత ఉన్న శ్రీలక్ష్మి ఈ కేసుల కారణంగా కేరీర్ను నష్ట పోయారనే వాదన ఉంది. దీంతో..జగన్ తన మీద కోపంతో శ్రీ లక్ష్మిని ఇబ్బంది పెట్టారనే కారణంగా..ఇప్పుడు తన ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీలక్ష్మిని కేంద్రం ప్రభుత్వం అధికారికంగా రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే..ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఆమెకు పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఇక, ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు ఇప్పటికే ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలవడనున్నాయి. వైయస్ వద్ద వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేసిన స్టీఫెన్కు ప్రధానంగా రాయలసీమలో పని చేసిన అనుభవం ఉంది. దీనికి తోడు పూర్తిగా ఫ్యాక్షన్ పైన కఠినంగా వ్యవహరించారు. దీంతో..ఇప్పుడు ఆయనకు నిఘా చీఫ్గా జగన్ నియమించనున్నారు.