రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ మౌనం.. ఆశలు వదిలేసుకున్నట్లేనా ?
మే నెలలో రాజధాని తరలింపుకు సిద్దమైన ఏపీ సర్కారుకు కరోనా వైరస్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోలేని, అమలు చేయలేని పరిస్ధితి ఉంది. దీంతో వైసీపీ సర్కారు ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తోంది. వచ్చే నెల 14 వరకూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అధికారిక లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉండటం, ఆ తర్వాత నెలరోజులు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది.
అంతా సిద్ధమైన తరుణంలో..
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి రాజధాని తరలింపు ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కరోనా వైరస్ ప్రభావంతో స్ధానిక ఎన్నికలు వాయిదా పడ్డాయో అప్పుడే రాజధాని తరలింపుపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత హైకోర్టు కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును నిలిపేయడం, ఇతరత్రా పరిణామాలతో వైసీపీ సర్కారు ఆలోచనలకు దాదాపుగా బ్రేక్ పడినట్లయింది. కరోనా వైరస్ ప్రభావం పెరగడంతో ప్రభుత్వం అధికారికంగా లాక్ డౌన్ విధించాల్సిన పరిస్ధితులతో ఇప్పుడు రాజధాని తరలింపు అనే మాటే ప్రభుత్వంలో ఎవరూ ప్రస్తావించలేని పరిస్ధితి.
రాజధాని తరలింపుకు కరోనా దెబ్బ..
సరిగ్గా రెండు వారాల క్రితం వరకూ సజీవంగా ఉన్నట్లు కనిపించిన ఏపీ రాజధాని విశాఖ తరలింపు ఆశలు అతి తక్కువ సమయంలోనే ఆవిరైనట్లు తాజా పరిణామాలను చూస్తే అర్ధమవుతోంది. ఈ మేనెలలో ఎలాగైనా రాజధాని తరలింపు చేపట్టాలని పట్టుదలగా ఉన్న వైసీపీ సర్కారు ప్రభుత్వ యంత్రాంగాన్ని రెండు నెలలుగా సిద్దం చేస్తోంది. ఉద్యోగ సంఘాలను ఒప్పించడంతో పాటు ప్రభుత్వంలోని కీలక స్ధానాల్లో ఉన్నతాధికారులకూ పలు హామీలు ఇచ్చింది. కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఇప్పుడు తరలింపు ఆశలన్నీ ఆవిరయ్యాయి.
కరోనా ఉండగా ముందుకెళ్లలేని పరిస్ధితి..
కేంద్రం ఆదేశాల మేరకు ఏపీలో కరోనా లాక్ డౌన్ వచ్చే నెల 14 వరకూ కొనసాగబోతోంది. ఆ తర్వాత పరిస్ధితిని బట్టి దాన్ని పొడిగించే లేక ఎత్తేస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కానీ కచ్చితంగా ఎత్తేస్తారని ఏ ఒక్కరూ చెప్పలేని పరిస్దితి. ఒకవేళ ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తేసిన ప్రభుత్వానికి గరిష్టంగా మిగిలి ఉండే సమయం నెలన్నర రోజులు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో కరోనా ఎఫెక్ట్ పూర్తిగా వీడిపోకుండానే రాజధాని తరలింపు ప్రక్రియ మొదలుపెట్టడం దాదాపు అసాధ్యమే. దీంతో కరోనా మహమ్మారి రాష్ట్రం నుంచి పూర్తిగా పోయినట్లు నిర్దారణ అయ్యే వరకూ రాజధాని తరలింపుపై ముందుకెళ్లలేని పరిస్ధితి ఉంటుందనే అంచనాలున్నాయి.
పరిస్ధితి గమనించాక ప్రభుత్వ పెద్దల మౌనం..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నెమ్మదిగా పెరుగుతోంది. తొలుత ఒకట్రెండు కేసులుగా కనిపించిన కరోనా కాస్తా ఇప్పుడు 13 కేసులకు చేరిపోయింది. చివరికి ఇది ఎంతవరకూ వెళుతుందో ఎవరూ చెప్పలేని పరిస్ధితి. ఇప్పటికీ ఏపీలో విదేశీ ప్రయాణికుల వివరాలు పూర్తిగా బయటకు రాని పరిస్ధితి. అవి పూర్తిగా బయటపడితే కానీ రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎప్పటి కల్లా తగ్గుతుందో చెప్పలేని పరిస్ధితి. దీంతో ప్రభుత్వ పెద్దలకు క్రమంగా వాస్తవం అర్ధమవుతున్నట్లే తెలుస్తోంది. అందుకే కేబినెట్ సమావేశంలో కానీ అనధికార సమావేశాల్లో కానీ సంబాషణల్లో కానీ ఎక్కడా రాజధాని తరలింపు వ్యవహారాన్ని ప్రస్తావించేందుకు ప్రభుత్వ పెద్దలు ఇష్టపడటం లేదు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ సర్కారు రాజధాని తరలింపుపై ఆశలు వదులుకున్నట్లు అర్ధమవుతోంది. చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రాజధాని తరలింపు ఏడాది వాయిదా పడినట్లేనని భావిస్తున్నారు.