సాఫ్ట్ వేర్ అని పిల్లనిస్తే! : ఇంటిల్లిపాదీ ఎంతలా వేధించారంటే..
మైదుకూరు : వరకట్న వేధింపులు.. ఆడపిల్ల పుట్టిందన్న ఛీత్కారాలు.. దేశంలో చాలామంది మహిళల వైవాహిక జీవితానికి అడ్డంకిగా పరిణమించాయి. చదువుకున్నోళ్లు చదువులేనోళ్లు అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆడపిల్లల పట్ల వివక్ష చూపిస్తున్నారు.
తాజాగా కట్నం వేధింపులతో పాటు ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో భార్యను విడాకులు డిమాండ్ చేస్తోన్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై కడప జిల్లాలోని మైదుకూరులో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. దువ్వూరు మండలానికి చెందిన ఓ అమ్మాయితో మైదుకూరులోని వినాయకనగర్ కు చెందిన పత్తి నరసింహులు, గోపాలమ్మ రెండవ కుమారుడు మనోహర్ కు గతేడాది మే29న వివాహం జరిగింది.
పెళ్లయిన మూడు నెలల వరకు కాపురం సజావుగానే సాగినా..! మూడు నెలల అనంతరం ఆమె గర్బం దాల్చడంతో అదనపు కట్నం డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు భర్త. భర్త వేధింపులకు తోడు ఆడబిడ్డ వరలక్ష్మి ఆమె భర్త ప్రసాద్, తోడి కోడలు శ్రీవిద్య, బావ సురేశ్ ల వేధింపులు కూడా తోడయ్యి ఆమెను చంపుతామని బెదిరించడం మొదలుపెట్టారు.
ఇదే క్రమంలో తానో ఆడపిల్లకు జన్మనివ్వడం.. కనీసం కూతురిని చూడడానికైనా మనోహర్ వెళ్లకపోవడంతో.. మధ్యలో పెద్ద మనుషుల పంచాయితీ లాంటివి పెట్టినా పెద్దగా లాభం లేకపోయింది. అదీగాక ఆడపిల్ల పుట్టిందని హేళన చేయడం.. విడాకులిస్తే వేరే పెళ్లి చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టాడు మనోహర్. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో తోచని పరిస్థితిలో మీరే దిక్కంటూ పోలీసులను ఆశ్రయించింది బాధిత మహిళ.
కాగా, దీనిపై స్పందించిన సీఐ వెంకటేశ్వర్లు.. బాధిత మహిళ ఫిర్యాదును ఎస్పీ వద్దకు తీసుకెళ్లామని, ఎస్పీ తనకు కేసు అప్పగించడంతో మనోహర్ ను అరెస్టు చేసి విచారణ చేపడుతున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే కూతురి జీవితం బాగుపడుతుందని 2 లక్షల కట్నం, 5.5 లక్షల బంగారం ఇచ్చి మరీ పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు దు:ఖమే దిక్కయింది.